Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల పక్షాన మాట్లాడేటోళ్లను గెలిపించండి
- మోడీ చెప్పిన రూ.15 లక్షలు రాలేదు..బతుకులు మారలేదు
- 12 గంటల పనివిధానం సరిగాదు
- రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయ లెక్కల్లో వాస్తవం లేదు : పాదయాత్ర ప్రారంభ సభలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కార్మికులారా ! చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ పీఎఫ్ గురించి మాట్లాడు తున్నరా? లేదా? అని చూడండి. మీ కనీస వేతనాల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తు న్నారా? లేదా? అనే దానిపై దృష్టి పెట్టండి. పనిగంటల గురించి మాట్లాతున్నరా? లేదా? పరిశీలించండి. చట్టాల రూపకల్పన సమయంలో మీవైపు ఉన్నారా? మీ యజమానుల వైపు ఉన్నారా? అనే దాన్ని వీక్షించండి. ఆ తర్వాత ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోండి. అంతేగానీ, ఎన్నికల సమయంలో వచ్చి కాలనీలో సీసీ రోడ్డు వేస్తా. కమ్యూనిటీ హాల్ కట్టిస్తా. కాలనీ మొత్తానికి కలిసి ఏదో కొనిస్తా, ఇలా ప్రలోభాలకు గురిచేసే రాజకీయ నాయకుల్ని నమ్మకండి. కనీస వేతనాలిచ్చి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యా లు కల్పిస్తే మీరే మంచిగా బతుకొచ్చు. అందుకే మీ సమస్యల గురించి మాట్లాడేటోళ్లకే ఓట్లు వేయండి. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచండి' అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 'కార్మిక కోడ్లను రద్దు చేయాలి..కనీస వేతనాల జీవోలు విడుదల చేయాలి' అనే డిమాండ్తో సీఐటీయూ ఆధ్వర్యంలో తలపెట్టిన కార్మిక గర్జన పాదయాత్రను బుధవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన సభలో నర్సిరెడ్డి మాట్లాడుతూ.. మోడీ 2014లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటి కైనా ఆ డబ్బులను వెనక్కి తెప్పిస్తే వడ్డీతో కలిపి ఒక్కొక్కరి ఖాతాలో రూ.20 లక్షల చొప్పు న వేయవచ్చునన్నారు. తెలంగాణ రాష్ట్రమొస్తే కార్మికుల బతుకులు బాగుపడతాయనీ, ఆకలిచావులుండవనీ కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. బిచ్చమె త్తుకునేవారు ఉండబోరనీ, అందరికీ చదువులు, వైద్య సౌకర్యాలు దక్కుతా యనీ, త్రిబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యా యని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర జీడీపీ 93 శాతం పెరిగి రూ.9 లక్షల కోట్లకు చేరిందనీ, తలసరి ఆదాయం 2,37,000 అయిందని ఆర్థిక మంత్రి చెబుతున్న దాంట్లో వాస్తవం లేద న్నారు. మనిషి బతకాలంటే రూ.21 వేలు కావాలనీ, కనీసం రూ.18 వేలు అయినా ఇవ్వాలని అడిగితే ఇవ్వలేని దుస్థితిలో మన పాలకులు ఉన్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి ఆరునెలలకోసారి డీఏ ఇవ్వాలనీ, రెండేండ్ల నుంచి అది అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లోనూ ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువ కనిపి స్తున్నారనీ, పీఆర్సీలో సూచించిన 19 వేల వేతనం వారిలో చాలా మంది కి దక్కట్లేదన్నారు. 8 గంటల పనివిధానాన్ని 12 గంటలకు పెంచడం వల్ల కార్మికులు 57 నుంచి 60ఏండ్లకు మించి బతకరనీ, వారి ఆయుప్ర మాణం తగ్గుతుందని వివరించారు. అందుకే 12 గంటల
పనివిధానాన్ని వ్యతిరేకించాలన్నారు. కౌలు దారుల హక్కుల్ని, వాస్తవ సాగుదారు కాలాన్ని తొలగించి కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చే సమయంలో శాసనమండలిలో వ్యతిరేకించానన్నారు. కార్మికవర్గం ముందుండి హక్కులు, వేతనాల కోసం కొట్లాడాలన్నారు.
బీడీ కార్మికుల పట్ల సర్కారు వివక్ష :ఎస్.రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికుల పోరాటాలతో వేతన సవరణ జీవో వచ్చిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ అన్నారు. అయితే, యాజమాన్యాల ఒత్తిడి మేరకు రాష్ట్ర సర్కారు వాటిని తొక్కిపెడుతున్నదన్నారు. పెన్షన్, రేషన్కార్డులు, తదితర పథకాలు, కనీసవేతనాలు, ఇలా అన్నింటికీ ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్.వీరయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు,
పాదయాత్ర బృంద సభ్యులు
పాదయాత్రను ప్రకృతి స్వాగతిస్తున్నా యాజమాన్యాలు మాత్రం కండ్లెర్ర జేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల యాజమాన్యాలకు కుడి, ఎడమ భుజాలుగా ఉండి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కనీసవేతనాలు సవరిస్తే తమకొచ్చే అధిక లాభాలను కోల్పోతామనే భావనతోనే యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయన్నారు. ఏడేండ్లలో నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగినా ఎందుకు వేతనాలు పెంచడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఒక్క కొత్తూరు పారిశ్రామిక వాడలోనే కార్మికులు వెయ్యి కోట్ల రూపాయల శ్రమదోపిడీకి గురయ్యారన్నారు. ఎక్కువ గంటలు పనిచేయించినా, సౌకర్యాలు లేకున్నా నోరు మూసుకుని పనిచేస్తారనే ఆలోచనతో మధ్యవర్తుల ద్వారా తీసుకొచ్చిన వలసకార్మికులతో పనిచేయిస్తున్నారని తెలిపారు. కొత్తూరులో 2,700 మంది దాకా మహిళా కార్మికులున్నారనీ, వారిలో ఎక్కువ మంది ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి కనీససౌకర్యాలు, వేతనాలు లేవన్నారు. యూనియన్ రహిత, రైతు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని మోడీ సర్కారు అంబానీ, ఆదానీలకు మాట ఇచ్చిందనీ, పరిశ్రమలను, వ్యవసాయ రంగాన్ని వారికి కట్టబెట్టేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నదని వివరించారు. రాష్ట్ర హక్కులను ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ సర్కారు వద్ద మోకరిల్లడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. కనీస వేతన జీవోల విడుదలలో తాత్సారం చేస్తే కార్మికుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదన్నారు.
కార్మికులు సింహాలై తిరగబడతారు : పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, పాదయాత్ర బృంద సభ్యులు
కొద్దిమంది పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తుందా? సమస్యలను పరిష్కరించి కార్మికుల పక్షం నిలుస్తుందా? అనే విషయాన్ని రాష్ట్ర సర్కారు తేల్చుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతారుగానీ, కార్మికుల వేతనాలు పెంచేందుకు ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. పైగా, కార్మికులు సమ్మెలు చేయొద్దు, పోరాటాలు చేయొద్దు అని అనటం ఎంత వరకు సబబని నిలదీశారు. కనీస వేతనాలు పెంచకపోతే కార్మికులు సింహాలై తిరగబడతారని హెచ్చరించారు.
యాజమాన్యాలకు సర్కారు వత్తాసు : భూపాల్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, పాదయాత్ర బృంద సభ్యులు
కనీసవేతన జీవోల విడుదల కోసం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నాలు చేసినా పట్టించుకోకపోవడం వల్లనే కోటీ 20 లక్షల కార్మికులను జీవోల కోసం పోరాటంలోకి దింపేందుకు ఈ పాదయాత్ర తలపెట్టామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, పాదయాత్ర బృంద సభ్యులు భూపాల్ చెప్పారు. విడుదల చేసిన 5 జీవోలను కూడా గెజిట్ కాకుండా పరిశ్రమల యాజమాన్యాలు అడ్డుకుంటు న్నాయని తెలిపారు. రాష్ట్ర సర్కారు కూడా వాటికే వత్తాసు పలుకుతున్నదని విమర్శించారు. కనీస వేతనాల జీవోలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వేతన సవరణ ఫైళ్లపై సంతకం పెట్టేతీరిక సీఎంకు లేదా? : పి.జయలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పాదయాత్ర బృంద సభ్యులు
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, పెట్రోల్, డీజీల్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం పెరగట్లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ పరిశ్రమల్లో వేతన సవరణ ఫైళ్లపై సంతకం పెట్టే సమయం ప్రభుత్వ పెద్దలకు లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర కార్యదర్శి జె.మల్లిఖార్జున్ మాట్లాడుతూ..పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను, ఆవశ్యకతను వివరించారు. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు రాజారావు, కోటంరాజు, కార్యదర్శులు జె.వెంకటేశ్, కోశాధికారి వంగూరు రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, నాయకులు కవిత, సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.
దేశాన్ని అమ్మేస్తున్నారు..
మోడీ సర్కారు దేశ సంపదను లూటీ చేసి కార్పొరేట్లకు అమ్మేస్తున్నరని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక కోడ్లను, వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలు జారీ చేస్తే రాష్ట్ర సర్కారుపై పైసా భారం పడబోదనీ, కోటీ 20 లక్షల కార్మికులకు ఉపయోగం జరుగుతుందని అన్నారు. గద్దెలను ఎక్కడానికి రాష్ట్రంలో కొన్ని పార్టీల వాళ్లు పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్మిక గర్జన పాదయాత్ర మాత్రం కార్మికుల వేతనాలు పెంచాలనీ, హక్కులను కాపాడాలనే డిమాండ్లపై జరుగుతున్నదని చెప్పారు.
- చుక్కరాములు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు
కార్మికుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే..
రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సర్కారు, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, వారిని చైతన్యపరిచేందుకు కార్మిక గర్జన నిర్వహిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు చెప్పారు. కార్మికుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ఈ యాత్ర సమరభేరిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ దేశ సంపదను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు