Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు హామీనిచ్చి ఏడాది పూర్తి
- ఆందోళనలో వీఆర్ఏలు
- నేడు కలెక్టరేట్ల ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'వీఆర్ఏలంతా పేదవారే. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం. చదువు, సీనియార్టీ అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పిస్తాం' 2017లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ. 'వీఆర్ఏలకు పేస్కేలు నిర్ణయిస్తాం.. ఉద్యోగ భద్రత కల్పిస్తాం..' సరిగ్గా ఏడాది కింద అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన. ఆయన హామీల తో 'ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది..సొంతింటి కల నెరవేరబోతుంది' అని వీఆర్ఏలు సంబురపడ్డారు. సీఎం కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకాలు కూడా చేసేశారు. నెలా..రెండు నెలలు..ఇలా ఏడాది గడిచింది. ఇప్పుడు వారు కొండంత ఆశతో కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారుగానీ సీఎం హామీలు మాత్రం గడపదాటలేదు. పీఆర్సీలో నూ తీవ్రఅన్యాయం జరిగింది. 30శాతం పెంచామన్నారుగానీ జీవోనైతే విడుదలకాలేదు. దీంతో పాతవేతనమే వస్తున్నది. ఈ నేపథ్యంలోనే వీఆర్ఏలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(టీవీఆర్ఏఏ) ఆధ్వర్యంలో వారు నేడు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నారు. రెవెన్యూ శాఖలో 22 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం వరకు దళితులే ఉన్నారు. వీరంతా ఆయా శాఖల ఉన్నతాధి కారుల పర్యటనల్లో క్షేత్రస్థాయి పనులు చేసిపెట్టడం, గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు సమాచారం చేరవేయడంలో, రెవెన్యూ శాఖ పనుల్లో కీలకంగా పనిచేస్తున్నారు. అరకొర వేతనమే అయిన ప్పటికీ ఎప్పటికైనా ఉద్యోగం పర్మినెంట్ కాకపోతదా? అనే చిన్న ఆశతో వారు పనిచేస్తున్నారు. చాలా గ్రామాల్లో అన్నదమ్ముళ్లు, వారి పిల్లలు వంతుల వారీగా (వాటాబందీ) పంచుకుని కొందరు కొన్ని నెలలు, మరికొందరు ఇంకొన్ని నెలలు చేస్తున్నారు. 2017లో వీరి వేతనం రూ.10,500కు పెరిగింది. ఆ సందర్భంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సొంత గ్రామాల్లో కట్టిస్తామనీ, అర్హులైనవారందరికీ అటెం డర్లు, వాచ్మెన్లు, జీపు డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేట ర్లుగా ప్రమోషన్లు ఇస్తామని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే 010 పద్దుకింద జీతాలు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ, నాలుగు ఏండ్లవుతున్నా సొంతింటి కల నెరవేరలేదు. 010 పద్దు కింద జీతం ఊసే లేదు. రెగ్యులరైజేషన్ మాట మరిచారు. 2020లో సెప్టెంబర్ 9వ తేదీన కొత్త రెవెన్యూ చట్టం తెచ్చే సమయంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వీఆర్ఏలు అతి తక్కువ వేతనంతో బతుకుతున్నారు కాబట్టి వారికి మినిమం పేస్కేల్ వర్తింపజేస్తామమన్నారు. అందుకు రూ. 250కోట్లు అయితే సరిపోతుందని కూడా చెప్పారు. తొమ్మిదినెలలు దాటినా ఆహామీ నెరవేరలేదు. తాజా గా పీఆర్సీ ప్రకారం 30శాతం వేతనపెంపు వీఆర్ఏ లకు వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఇప్పుడిస్తున్న గౌరవవేతనానికి అది కలిపితే వారి వేతనం రూ.14 వేల లోపే అవుతుంది. ఇది కనీస వేతనానికి ఇది ఐదువేల రూపాయలు తక్కువ. ఆవేతనమైనా వస్తుం దా అంటే అదీ లేదు. ఆర్థిక శాఖ సర్క్యూలర్ జారీ చేసిందిగానీ జీవోలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో వీఆర్ఏలకు పాతవేతనమే వస్తున్నది. తమ నూ పేస్కేలులో చేర్చి న్యాయం చేస్తారని ఆశించిన వారికి ఇది పిడుగులాంటి వార్తే. ఈ క్రమంలో తమ కు ఇస్తున్న గౌరవ వేతన పెంపు అవసరం లేదనీ, పే స్కేల్ వర్తింపజేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని వీఆర్ ఏలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారు రిటైర్మెంట్ కోరుకుంటే వారి వారసులకు ఉద్యోగాలిస్తామని కూడా సీఎం ప్రకటిం చారు. ఉమ్మడి మహబూబ్నగర్, మరో ఒకట్రెండు జిల్లాల్లో వాటా బందీగా కింద పనిచేస్తున్న గ్రామాల్లో ఆయా కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈసమస్యకూ పరిష్కారం చూపెట్టలేదు. ఈ క్రమం లో కొందరు వీఆర్ఏలు తమ వంతు అయిపోయినా దిగేందుకు ససేమిరా అనటంతో చంపుకునే వరకు పరిస్థితి వెళ్లింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ వీఆర్ఏను పాలోళ్లు గొడ్డళ్లతో నరికి చంపారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.. పేస్కేలు ఇవ్వాలి..
సీఎం ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేలు వర్తింపజేయాలి. ప్రస్తుతమున్న వేతనంపై 30 శాతం కాకుండా పీఆర్సీ సూచనల ప్రకారం కనీసవేతనం రూ.19 వేలు ఇవ్వాలి. వీఆర్ఏలలో దళితులే ఎక్కువ. అందరూ పేదవారే. వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి. కరోనాతో మరణించిన వీఆర్ఏలందరికీ రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలివ్వాలి. అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలి. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని గురువారం తలపెట్టిన కలెక్టరేట్ల ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలి.
- వంగూరు రాములు, టీవీఆర్ఏఏ ప్రధాన కార్యదర్శి