Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమూద్ అలీ
- పెన్నా శివరామకృష్ణకు కాళోజీ సాహితీ పురస్కారం అందజేత
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ మాండలికానికి, భాషకు, యాసకు ప్రతీక కాళోజి నారాయణరావు అని, ఆయన వాడుక భాషనే సీఎం కేసీఆర్ అభిమానిస్తారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఉర్దూ పాఠశాలల్లోనూ తెలుగు నేర్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజి నారాయణరావు 107వ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. కాళోజి సాహితీ పురస్కారం-2021ను ప్రముఖ విమర్శకుడు సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణకు ప్రదానం చేశారు. లక్ష వెయ్యి 116 నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాళోజి సమాజమే జీవితంగా గడిపారని, 'పుట్టుక నీది, చావు నీది, జీవితమంతా దేశానిది' అన్న కాళోజి కవిత ఎంతో స్ఫూర్తినిస్తుందని గుర్తు చేశారు.
సభకు అధ్యక్షత వహించిన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ పురస్కారం పొందినా నిరాడంబర జీవితం గడిపిన కాళోజి తెలంగాణ భాష పట్ల, ప్రాంతం పట్ల అమితమైన అభిమానం చూపేవారని అన్నారు. జీవితంలో పరుల కోసం ఏ కొంచెం పాటుపడినా మహనీయులుగా మరణించి కూడా జీవిస్తారని అన్నారు. కాళోజి వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాళోజి పేరిట వరంగల్లో విశ్వవిద్యాలయం, కళాక్షేత్రం నెలకొల్పటంతో పాటు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా బోధిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి.రమణ మాట్లా డుతూ.. అసమ్మతి, ప్రతిఘటన, ధిక్కారాలకు కాళోజి ప్రతీక అని, ఆయన పేరిట పురస్కారాన్ని ప్రభుత్వం నేలకొల్పటం గొప్ప విశేషమని అన్నారు.
నల్లగొండ వాసి.. కవితా తపస్వి శివరామకృష్ణకు కాళోజి పురస్కారం ఇవ్వడం సముచిత నిర్ణయమన్నారు. ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న మాట్లాడుతూ.. సంప్రదాయ కవిత్వం రాయగల సత్తా వున్నా కాళోజి జనం కోసం, తెలంగాణ యాస కోసం నిలిచారని కొనియాడారు. శివరామకృష్ణ గజల్స్ రాసినా, వచన కవిత చెప్పినా సత్యావిష్కరణం, ప్రగతిశీలత, ప్రామాణికంగా ఉంటాయని ప్రశంసించారు. గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. శివరామకృష్ణ సమీక్షకుడు, మంచి విమర్శకుడు అని అభినందించారు. సాంస్కృతిక సారథి చైర్మెన్ రసమయి బాలకిషన్ 'కాళోజి గొడవ తెలంగాణ కన్నీళ్ల గోడవే'నని అభివర్ణించారు. సాంస్కృతిక పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు, సంచాలకులు మామిడి హరికృష్ణ స్వాగతం పలికారు.