Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 25న మహా ధర్నా
- పోస్టరు విడుదల చేసిన ఆవాజ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనారిటీ బంధు పథకాన్ని వెంటనే ప్రకటించి, అమలు చేయాలని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే 'మహా ధర్నా' లో మైనారిటీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని ఆవాజ్ రాష్ట్ర కార్యాల యంలో వీరితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, అతీఖుర్ రెహమాన్, సహయ కార్యదర్శి మహమ్మద్ అలీ, రాష్ట్ర నాయకులు మగ్భూల్ మియా తదితరులు మహాధర్నా పోస్టర్ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాజకీయ లబ్దికోసమే ఆకర్షణీయ పథకాలు ప్రవేశ పెడుతున్నారని చెప్పారు. గతంలో దళితులకు ఎన్నో పథకాలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వాటిని అమలు చేయకుండా అటకెక్కించారని వివరించారు. సీఎం వాగ్దానం చేసిన హామీలు అమలు కావడం లేదనీ, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు, యూనివర్సిటీ వీసీలు, టీఎస్పీఎస్సీ తదితర చోట్ల మైనారిటీలకు స్థానం ఇవ్వలేదని అన్నారు. మైనారిటీ కమిషన్ చైర్మన్ పదవీ కాలం ముగిసి ఏడాది గడిచినప్పటికీ ఇప్పటికీ నూతన చైర్మెన్, సభ్యులను నియమించలేదని అన్నారు. ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారనీ, 98 శాతం చేతివత్తులు, చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదనీ, ప్రయివేటు ఫైనాన్సర్ల దగ్గర అప్పు చేసి ఆర్థికంగా చితికి పోతున్నారని చెప్పారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం లేదు కాబట్టి, దళిత బంధు తరహాలో ప్రభుత్వం 'మైనారిటీ బంధు పథకం' ప్రకటించి ప్రతి పేద మైనార్టీ కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.