Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర సచివాలయం సమీపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రాజెక్టును 12 నుంచి 15 నెలల్లో పూర్తి చేయనున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ కేపీసీని ఆయన ఆదేశించారు. గురువారం హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పర్యవేక్షించారు. 125 అడుగుల విగ్రహం, 50 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 175 అడుగుల్లో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పలు పరీక్షలు, డిజైన్ ఖరారు, సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో చైనా, సింగపూర్ లో ఇలాంటి భారీ విగ్రహాలను పరిశీలించామనీ, అందువల్ల కొంత ఆలస్యం జరిగిందని వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభారు పటేల్ విగ్రహం తర్వాత ఇదే పెద్దదనీ, అంబేడ్కర్ విగ్రహాల్లో కూడా అతి పెద్దది, ఎత్తైనదని తెలిపారు.
దీన్ని 11.4 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామనీ, మ్యూజియం, ఫోటోల ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్, గ్రంథాలయం, ధ్యానమందిరం, సమావేశ మందిరం, లేజర్ షో, క్యాంటీన్, సువిశాలమైన పార్కింగ్ ,వాష్ రూంలు నిర్మిస్తామని చెప్పారు. స్కిల్స్ డెవలప్ మెంట్ వర్క్ షాపులు, సెమినార్లు జరుగుతాయనీ, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆకర్షణీయంగా ఉంటూ ముఖ్య పర్యాటక ప్రదేశంగా వెలుగొందనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.