Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా సాకుతో వినతిపత్రం తీసుకునేందుకు నిరాకరణ
- వ్యకాస, గిరిజన సంఘం నేతల నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తమ పట్టాభూములను కబ్జా చేస్తున్నారంటూ బాధితులు చేసిన ఫిర్యాదును రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు స్వీకరించేందుకు నిరాకరించడం పట్ల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ గిరిజన సంఘం అభ్యంతరం వ్యక్తం చేశాయి. కరోనా సాకు చూపించి వినతిపత్రం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆకార్యాలయం వద్ద ఆయా సంఘాల నేతలతో ధర్నాకు దిగారు. జనగామా జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టు నాగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే 48హెచ్లో ఉన్న 15 ఎకరాల భూమిని జాలుబాయితండాకు చెందిన 12 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ భూమిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బంధువు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తరిగొప్పుల తహసీల్దార్ వీణ, అధికారులు ఫరీదుద్దీన్, హరిత భూకబ్జాదారులతో కుమ్మక్కై ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందులో భాగంగా గిరిజనులపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారనీ,అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు.బాధ్యులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ, గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, నాయకులు భూక్యా చందు, అజ్మీరాసురేష్ నాయక్, జాలుబాయితండా నివాసి సభావత్ రాజునాయక్, కొడవత్ శ్రీనువాస్ నాయక్, కోడావత్ సుధాకర్, లవుడియా చోక్ల తదితరులు పాల్గొన్నారు.