Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయండి : ప్రజా సంఘాల సమావేశం పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 12న రాష్ట్ర సదస్సును హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నామనీ, దానిని జయప్రదం చేయాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లోని విద్యానగర్లో గల మార్క్స్భవన్లో ప్రజా సంఘాల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎఐకెయస్సిసి రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, పశ్మపద్మ, రాయల చంద్రశేఖర్, వల్లపు ఉపేందర్రెడ్డి, అచ్యుత రామారావు, కన్నెగంటి రవి, జక్కుల వెంకటయ్య, ప్రసాదన్న, కొండల్, నాగిరెడ్డి, జాతీయ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, విస్సాకిరణ్, రాజారావు, ఎస్వీ రమ(సీఐటీయూ), ఆర్. వెంకట్ రాములు, కాంతయ్య ( వ్యవసాయ కార్మిక సంఘం) కోట రమేష్ (డివైఎఫ్ఐ), వెంకటేష్ (ఏఐటియుసి), సూర్యం, ఎం శ్రీనివాస్ (ఐఎఫ్టియు) సంధ్య, ఝాన్సీ (పీవోడబ్ల్యూ) లిస్సి జోసెఫ్, ఇందిర, సోమిడి శ్రీనివాస్, సైదులు, వనం సుధాకర్, ప్రదీప్, శివరామకృష్ణ,పరుశురాం, బోయినపల్లి రాము, అనిల్ కుమార్, శంకర్ (డిబిఎఫ్), సిద్ధిరాములు (బిఎల్టియు) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలనీ, అందుకోసం ప్రత్యేకంగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని చెప్పారు. దశాబ్ధాలుగా పోరాడి సాధించిన కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేసి, ఆ వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. రైతాంగ ఉద్యమంపై మోడీ సర్కారు నిర్బంధం ప్రయోగిస్తున్నదని చెప్పారు. బీజేపీ సర్కారు ఇదే విధానాన్ని కొనసాగిస్తే దేశ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరగనున్న భారత్బంద్కు రాజకీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పదినెలలుగా రైతులు పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్చలు జరిపిందని విమర్శించారు. అందుకే బంద్కు బీజేపీ మినహా అన్ని పార్టీలు, కార్మిక, మహిళ, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు సంపూర్ణమద్దతు తెలిపాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చర్యలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజన రైతులందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలనీ, అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.