Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట వీఆర్వోల నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్వోలకు వెంటనే జాబ్చార్ట్ విడుదల చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో వీఆర్వోలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రాష్ట్ర సర్కారు తమను ఏడాది క్షోభకు గురిచేస్తున్నదని వాపోయారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, శాఖాపరంగా బదిలీలను కోల్పోయామన్నారు. వ్యవస్థ రద్దయినప్పటికీ విపత్కర పరిస్థితుల్లో అదే విధులు నిర్వహిస్తున్నామన్నారు. వీఆర్వోలను శాఖలోనే సర్దుబాటు చేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇతర శాఖలకు వెళ్తామంటే ఆప్షన్లు ఇచ్చి పంపాలని కోరారు. వీఆర్వోల సీనియార్టీకి, ఇంక్రిమెంట్లకు నష్టం జరుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో, ఇతర సమస్యలతో చనిపోయిన వీఆర్వోల కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలని కోరారు. జోనల్ వ్యవస్థలో వీఆర్వోలకు కూడా సరిసమానమైన హోదాతో బదిలీలకు అవకాశమివ్వాలన్నారు. రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల కోసం ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అకారణంగా సస్పెండైన వీఆర్వోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధధాన కార్యదర్శి పల్లెపాటి నరేశ్, మహిళా విభాగం నేత ప్రతిభ, సహ అధ్యక్షులు భిక్షపతి, ఉపాధ్యక్షులు రామేశ్వరరావు, ఆశన్న, మౌలానా, రమేశ్, మురళి, కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్, సాంస్కృతిక విభాగం కార్యదర్శి రాంచందర్, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్, కోశాధికారి రమేశ్, రాష్ట్ర నాయకులు రాజన్న, సర్వేశ్, తదితరులు పాల్గొన్నారు.