Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 46.60 అడుగులకు..
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. గురువారం ఉదయం 43 అడుగులకు చేరుకోవటంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గురువారం రాత్రి 6 గంటల సమయంలో 46.60 అడుగులకు నీటి ప్రవాహం చేరుకుంది. నాలుగైదు రోజులుగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్న విషయం తెలిసిందే. దాంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం రాత్రికి 48 అడుగులకు చేరుకునే అవకాశం ఉందనీ, రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు అత్యవసర సేవలకు 08744-241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08743-323444లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అత్యవసర సేవలకు సిబ్బంది కార్యస్థానంలో అందుబాటులో ఉండాలనీ, అన్ని రకాల సెలవులు రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. కాగా, గత నెలలో కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకొని గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇదే రీతిలో ప్రమాదానికి చేరుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.