Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ, ముస్లింల మధ్య అల్లర్లుగా చిత్రీకరిస్తున్న బీజేపీ
- పోరాట యోధులకు కేంద్రం పింఛన్ ప్రకటించాలి : చాడ
- 11 నుంచి బస్సుయాత్ర వాల్పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం రాచరిక పాలనకు కమ్యూనిస్టులు చరమగీతం పాడారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలు కలిసి నిజాం అరాచకాలు, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారని గుర్తు చేశారు. కానీ ఆ పోరాటాన్ని హిందూ, ముస్లీంల మధ్య అల్లర్లుగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించాలనీ, పోరాట యోధులకు పింఛన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 11 నుంచి 17 వరకు జరపనున్న బస్సుయాత్ర పోస్టర్, కరపత్రాలను గురువారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ బలిదానాలు జరిగిన ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం సాధించాలంటే సమరశీల పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పోకడలు, మతోన్మాదం రెచ్చగొట్టే విధానాలు అవలంబించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో సాయుధ పోరాటాన్ని గుర్తించలేదని చెప్పారు. రాష్ట్రం రాక ముందు సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెడతానని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరవేశారని వివరించారు. ఇప్పుడు ఎంఐఎం మిత్రపక్షం కావడంతో భయపడుతున్నారా?అని ప్రశ్నించారు.
నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్లీ భూ పోరాటాలు చేస్తామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సిద్ధమవుదామని వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ తదితరులు పాల్గొన్నారు.