Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెట్టి చాకిరీకి, శ్రమ దోపిడీకి గురయ్యాం
- ఇన్నాండ్లకు మా కోసం మీరొచ్చారు..
- సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన 'కార్మిక గర్జన పాదయాత్ర'
- బృందం ఎదుట తమ గోడు వెల్లబోసుకున్న కార్మికులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక చట్టాల అమలు, వేతనాల పెంపు, పని గంటల తగ్గింపు, కార్మికుల రక్షణ, కార్మికుల హక్కుల సాధన పోరాటం కోసం, కార్మికులను చైతన్యం పరిచేందుకు సీఐటీయూ 'కార్మిక గర్జన పాదయాత్ర' చేపట్టింది. ఈ యాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా కొత్తూర్లో ప్రారంభమై వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తూ కార్మికుల సమస్యలను, బాధలను తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. కార్మికులకు అండగా ఉంటామనీ, న్యాయపరమైన హక్కులను ఐక్యంగా పోరాడి సాధించుకుందామని పాదయాత్ర బృందం కార్మికులకు భరోసా కల్పిస్తోంది. తమ సమస్యలపై కూడా మాట్లాడేవారు ఉన్నారనే నమ్మకం కార్మికుల్లో కలిగించింది. ఈ క్రమంలోనే గురువారం కాటేదాన్ పారిశ్రామిక వాడల్లోకి ప్రవేశించిన పాదయాత్ర బృందానికి కార్మికులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ స్వాగతం తెలిపారు. ఇన్నాళ్లు యాజమాన్యాల చేతుల్లో చిక్కుకుని కార్మికులు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో.. ఎలా వెట్టిచాకిరీకి, శ్రమ దోపిడీకి గురయ్యారో.. బృందానికి వివరించారు. రోజుకు సుమారు 12గంటలు.. రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసినా తమ పొట్ట నింపుకోలేని దుస్థితిలోనే ఉన్నట్టు పాదయాత్ర బృందం ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తమ కోసం మాట్లాడే వారి కోసం ఇన్నాళ్లు నిరీక్షించామనీ, ఇన్నాండ్లకు సీఐటీయూ పాదయాత్ర రాకతో కొండంత బలం చేకూరిందని బృందం సభ్యులతో తమ బాధలను పంచుకున్నారు.
నాకు ఉద్యోగం ఇప్పించండి : రాహుల్, వలస కార్మికుడు
'బతుకుదెరువు కోసం ఊరి వదిలి వచ్చి ఇక్కడ కంపెనీల్లో పనిచేస్తున్నా సార్.. ఆరు నెలల కింద అబింక రవ్వ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నా చేతులు, కాళ్లు.. ఒళ్లంతా కాలింది. కంపెనీ యాజమాన్యం ఒకట్రెండు రోజులకు సరిపడా వైద్య ఖర్చులకు డబ్బులు ఇచ్చింది. తర్వాత ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు లేక మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నా. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారికి తిండి పెట్టలేని పరిస్థితి. ఏ పని చేద్దామన్న ఆరోగ్యం సహకరించడం లేదు. నా బిడ్డలను ఏట్లా సాకాలో.. వారి భవిష్యత్ ఏంటో అర్థమయితలేదు సారు.. మీరైనా నేను పనిచేసిన కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి.. నాకు ఉద్యోగం ఇప్పించి, న్యాయం జరిగేలా చూడండి. నాకు ఇక్కడ దిక్కుమొక్కు ఎవరు లేరు. అడిగే వారే లేరన్న ధైర్యంతో కంపెనీ యాజమాన్యాలు నన్ను లెక్క చేయడం లేదు. కార్మికుల బాధలు తెలుసుకోవడానికి మీరు వస్తున్నారని తెలిసి నా బాధ మీకైనా చెప్పుకోవడానికి వచ్చా. ఏట్లైనా నాకు సాయం అందేలా చూడండి సారూ..' అంటూ వలస కార్మికుడు రాహుల్ తన గోడును సీఐటీయూ బృందంతో వెల్లబోసుకున్నాడు.
నడిచే పరిస్థితి లేదు : లక్ష్మణ్, వలస కార్మికుడు
ఎన్నో ఏండ్లుగా అంకిత్ ఫుడ్ కంపెనీలో దినసరి కూలిగా పనిచేస్తున్నా.. ఏడాదిన్నర కిందట మధ్యాహ్న భోజనం సమయంలో వాటర్ ట్యాంక్ దగ్గర తాగు నీటి కోసం వెళ్లి కాలు జారీ పడటంతో నడుము విరిగింది. ఆ ఒక్కరోజు మాత్రమే కంపెనీ యాజమాన్యం వైద్యం చేయించి వదిలేసింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పనిచేయలేక ఇంటికే పరిమితమయ్యా. ఒకరి సాయం లేనిది.. బాత్రూమ్కు కూడా పోలేని ధీనమైన స్థితి నాది. కంపెనీ యాజమాన్యం నా బతుకును గాలికి వదిలేసింది. నన్ను నమ్ముకున్న నా తల్లిదండ్రులు, భార్య రోడ్డున పడ్డారు. మీరే ఏట్లైనా నా గోసను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండ్రి. ఇప్పటి దాకా నా బాధను ఎవ్వరికన్నా చెబుదామన్న మా దగ్గరకు ఎవ్వరూ రాలేదు. యూనియన్లు, సంఘాల ముచ్చట మాకు తేల్వదు. నేను పనిచేసిన యాజమాన్యాన్ని నన్ను ఆదుకోండి సారూ అంటూ అడిగి, అడిగి విసిగిపోయినా.. పట్టించుకోలేదు. గిన్నాళ్లకు మీరు మా బాధలు తెలుసుకోనికే వచ్చిండ్రు. మాకు ఎలాగైనా సాయం అందేలా చూడండి' అంటూ నడవలేని స్థితిలో ఉన్న లక్ష్మణ్ తన బాధను పంచుకున్నాడు.