Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా బ్రిటిష్ కాలం నాటి చట్టాలే
- కార్మిక చట్టాల అమలులో యాజమాన్యాలు, అధికారుల నిర్లక్ష్యం
- కాటేదాన్ క్లస్టర్లో రెండవ రోజూ సాగిన పాదయాత్ర
- దుర్భర జీవితాలు గడుపుతున్న కార్మికులు : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కంపెనీలు కార్మికుల పాలిట జైళ్లుగా మారాయనీ, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా ఇక్కడ ఇంకా బ్రిటిష్ కాలం నాటి చట్టాలే అమలు కాకపోవడం దురదృష్టకరమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి చేస్తున్న కార్మిక గర్జన పాదయాత్ర రెండవ రోజైన గురువారం కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకుంది. వీరికి కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాటేదాన్లో ఏర్పాటు చేసిన సభలో వీరయ్య మాట్లాడారు. కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులందరూ యాజమాన్యాల చేతిలో పూర్తిగా బందీలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలకు తాళాలు వేసి లోపల కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని తెలిపారు. అంబికా రవ్వ కంపెనీలో పనిచేసే రాహుల్ అనే కార్మికుడికి పనిచేసే సమయంలో రెండు చేతులూ కాలాయి.. శరీరంపైనా కాలిన గాయాలు కనబడుతున్నా.. యాజమాన్యం అతడికి నష్ట పరిహారం చెల్లించకుండా అతనితో 12 గంటలు పని చేయించుకుంటోందని తెలిపారు. అదేవిధంగా అంకిత్ కంపెనీలో పనిచేసే లక్షణ్ అనే కార్మికుడికి ప్రమాదవశాత్తు కంపెనీలో కిందపడి అతని వెన్నెముక పూర్తిగా దెబ్బతిని రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడని అన్నారు. కనీసం అతనికి కంపెనీ యాజమాన్యం వైద్యం కూడా చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ ఆయిల్ మిల్లో పనిచేసే మహిళలకు కనీస వేతనాలు చెల్లించాలని కొంతకాలంగా ఆందోళన చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్మిక గర్జన పాదయాత్రను చూసి కంపెనీ యాజమాన్యం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కొత్తూరు, కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలోని పలు కంపెనీల ముందు పాదయాత్ర వాల్ పోస్టర్లను కంపెనీ యజమానులు తొలగించారన్నారు. కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారనీ, వారికి స్థానిక కార్మికులు అండగా ఉండాలని కోరారు. కాటేదాన్లో కార్మిక శాఖ అధికారులు కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మిక చట్టాలు అమలు కాకుండా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాయిలర్ల దగ్గర ప్రమాదకరస్థితిలో కార్మికులు పనిచేస్తున్నా వారికి కనీస భద్రతా పరికరాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ.. కాటేదాన్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ కనీస వేతనాలు, ఎనిమిది గంటల పని దినం, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నా మని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను పూర్తిగా కాల రాసిందని అన్నారు. అంతకుముందు బుద్వేల్ శ్రీ రామ్ నగర్ చౌరస్తా వద్ద భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రలో కార్మికుల సమస్యల మీద పీఎన్ఎం కళాకారుల బృందం పాడిన పాటలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాదయాత్రలో పలువురు కార్మికులు తమ సమస్యల మీద సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్యకు వినతిపత్రాలు అందజేశారు. పాదయాత్రలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. చంద్రమోహన్, జిల్లా శ్రామిక మహిళా నాయకురాలు కవిత, జిల్లా కోశాధికారి మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు కురుమయ్య, గట్టయ్య, భాస్కర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.