Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు సమ్మెనోటీసు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లంతా ఈ నెల 24న జరిగే అఖిల భారత సమ్మెలో పాల్గొంటారని కేంద్ర, కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు వారు సమ్మె నోటీస్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్బోస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రమ, జె.వెంకటేశ్, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ప్రేమపావని, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలన్నారు. కరోనా కాలంలో పనిచేసిన స్కీమ్ వర్కర్లందరికీ రూ.7,500 చొప్పున ఏరియల్స్ చెల్లించాలనీ, కోవిడ్తో చనిపోయిన వారికి రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన స్కీమ్ వర్కర్లందరికీ రూ.10 వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక ఆరోగ్య సర్వీసులు, ఐసీడీఎస్, ఎండీఎంఎస్లను ప్రయివేటీకరించొద్దని కోరారు. ఆహారం, విద్యా హక్కుల మాదిరిగానే సార్వత్రిక ఆరోగ్య భద్రత హక్కు చట్టాన్ని తేవాలని విన్నవించారు. జీవో నెంబర్ 60 ప్రకారం అంగన్వాడీ టీచర్లకు రూ.19,500, ఆషాలు, హెల్పర్లు, మినీ వర్కర్లకు రూ.15,600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పాత బకాయిలు చెల్లించి వేసవి కాలంలో కూడా వేతనాలు చెల్లించే విధానం ప్రవేశపెట్టాలని కోరారు. మధ్యాహ్న భోజనం పథకంలో ఇస్కాం, అక్షయపాత్ర లాంటి సంస్థలను నిషేధించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసేందుకు పీహెచ్సీల్లో డ్యూటీలకు వెళ్తున్న ఆశాలకు టీఏ, డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐకేపీ వీఓఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపేయాలనీ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్హెచ్ఎం డైరెక్టర్కు టియుఎంహెచ్ఇయూ సమ్మె నోటీస్
తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ నేతత్వంలో ప్రతినిధులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణను కోఠిలోని ఆమె కార్యాలయంలో కలిసి గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24న జరిగే సమ్మెలో తాము పాల్గొంటామన్నారు. హెల్త్ మిషన్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచాలనీ, సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సేవలందిస్తున్న ఉద్యోగులందరికి రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని కోరారు. ఆరోగ్య రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆరు శాతం నిధులు కేటాయించి సౌకర్యాలు మెరుగుపరచాలనీ, ఎక్కువ మంది ఆరోగ్య సిబ్బందిని నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 రిస్క్ అలవెన్సు కింద నెలకు రూ.10 వేలు చెల్లించాలనీ, విధుల్లో కరోనా సోకిన వారికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలను అమలు చేయించాలన్నారు. పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల ందరికీ ఆయా కేడర్ల మినిమం బేసిక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీస్ అందజేసిన వారిలో యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఎ.కవిత, కె.బలరాం, మహమ్మద్ ఫసియొద్దీన్, కె.సరోజ, ఎస్.హరిశంకర్, ఎం.కిషన్ శ్రీనివాస్ ఉన్నారు.