Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో గవర్నర్ తమిళిసైతో సీఎం భేటి..
- 'అసెంబ్లీ'పై చర్చించనున్న కేసీఆర్
- గణేష్ నిమజ్జనం తర్వాత సమావేశాలు
- 22 నుంచి ఉండే అవకాశం
- ఢిల్లీ విమానం దిగాక సీఎం బిజీబిజీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్... గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. హస్తినలో టీఆర్ఎస్ కార్యాలయ శంకుస్థాపన నిమిత్తం ఈనెల ఒకటో తేదీన ఢిల్లీ విమానమెక్కిన సీఎం... వాస్తవానికి మూడో తేదీన్నే తిరిగి రావాల్సి ఉంది. కానీ పలు అధికారిక, అనధికారిక, రాజకీయ భేటీల నేపథ్యంలో ఆయన ఆర్రోజులపాటు అదనంగా అక్కడే మకాం వేశారు. గురువారం హైదరాబాద్కు చేరుకున్న సీఎంను ప్రగతి భవన్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిశారు. మరోవైపు సీఎం రెండు మూడు రోజుల్లో గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అంశాలతోపాటు ఈనెల్లో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలపై ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. ఆ తర్వాత శాసనసభ, శాసనమండలి సమావేశాల తేదీలు ఖరారయ్యే అకాశముంది. అసెంబ్లీ, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం... వినాయక చవితి నేపథ్యంలో గణేష్ నిమజ్జనాల (ఈనెల 19) తర్వాతే అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఇంకా చెప్పాలంటే 22 నుంచి పది రోజులపాటు శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని సీఎం ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. గవర్నర్తో అధికారికంగా ఒకసారి మాట్లాడి ఆయా తేదీలను ఆయన ఖరారు చేయనున్నారని తెలిసింది. ఎమ్మెల్సీ పదవికి క్యాబినెట్ ప్రతిపాదించిన పాడి కౌశిక్ రెడ్డి పేరుపై తానింకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదంటూ గవర్నర్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్... ఆమెతో నిర్వహించబోయే భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం... రాష్ట్రానికి సంబంధించిన జల వివాదాలు, జాతీయ రహదారులు, వాటికి నిధులు, ఐపీఎస్ల కేటాయింపులు, కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ పాఠశాలలు తదితరాంశాలపై ఆయన ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. బయటికి కనపడే ఈ అధికారిక కార్యక్రమాలతోపాటు అనధికారికంగా ఆయన కేంద్రంలోని పలువురు పెద్దలు, బీజేపీ పెద్ద తలకాయలతో భేటీ అయినట్టు సమాచారం. అయితే అందుకు సంబంధించిన వివరాలేవీ బయటకు పొక్కకుండా టీఆర్ఎస్ వర్గాలు జాగ్రత్తపడ్డాయి. మరోవైపు నమస్తే తెలంగాణ ఎమ్డీ దామోదరరావు తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన ఇంటికి సీఎం గురువారం సాయంత్రం వెళ్లారు. దామోదరరావుతోపాటు ఆయన తల్లి అండాళమ్మను పరామర్శించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు తన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ను కలిశారు.