Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు
- ట్యాంక్బండ్వైపు వద్దంటూ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని గురువారం స్పష్టం చేసింది. అలాంటి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. తమ ఉత్తర్వులను ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసులు అమలు చేయాలని ఆదేశించింది. గణేష్, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారించింది. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు..తాజాగా తీర్పును వెలువరించింది. హుస్సేన్సాగర్లో ట్యాంక్బండ్వైపు నుంచి నిమజ్జనాలు చేయొద్దని..పీవీ మార్గ్, నెక్లెస్రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు తదితర ప్రాంతాల్లో చేసుకోవచ్చని తెలిపింది. హుస్సేన్సాగర్లో పూర్తిగా కాకుండా ప్రత్యేకంగా రబ్బర్ డ్యాం తరహా ఏర్పాట్లు చేసి నిమజ్జనాలు చేయాలని ఆదేశించింది. నిమజ్జనం తర్వాత అక్కడ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హుసేన్సాగర్ వైపు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఇండ్లలోనే బకెట్లలో నిమజ్జనం పూర్తిచేసేలా చూడాలని పేర్కొంది. ఈ కార్యమ్రాల్లో భక్తులు భౌతికదూరం పాటించేందుకు చర్యలు చేపట్టాలనీ, నిమజ్జనం రోజు జీహెచ్ఎంసీ ఆధికారులు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. పర్యావరణానికి విఘాతం కలిగించే విగ్రహాలను ప్రొత్సహించవద్దనీ, రోడ్లపై ఆటంకం కలిగించేలా మండపాలు ఉండకూడదని చెప్పింది. సాంస్కృతిక కార్యకలాపాలు నియంత్రణలో ఉండేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. రాత్రి 10గంటల తర్వాత ఎలాంటి ధ్వని కాలుష్యం రాకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.