Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు పరిహారం ఇప్పించాలి
- సీఎం కేసీఆర్కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం లెక్కగట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ఇప్పించాలని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టాలని సూచించారు. రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేయాలనీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 18 జిల్లాల్లో సుమారు 6.30 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, సోయా, పెసర, జొన్న పంటలకు పాక్షికంగా నష్టం జరిగిందని వివరించారు. ఇందులో రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. గతేడాది ఇదే సీజన్లో కురిసిన భారీ వర్షాలకు 12,32,546 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయనీ, 6,97,471 మంది రైతులు నష్టపోయారనీ, రూ.2,481 కోట్లు పంటనష్టం జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్రం 2018లో రూ.587.31 కోట్ల నష్టానాకి రూ.148.90 కోట్లు పరిహారం విదిల్చి, మిగతా రూ.438.41 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. 2019లో రూ.402.28 కోట్లు పంటనష్టం జరిగితే పైసా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు.గడిచిన మూడున్నరేండ్ల కాలంలో రైతులకు జరిగిన నష్టాన్ని లెక్కగట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టాలని కోరారు. బాధిత రైతులకు తక్షణ సాయంతంగా ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.