Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయీబ్రాహ్మణ నిరసనలో దాసోజు హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నాయీ బ్రాహ్మణుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతున్నదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ విమర్శించారు. వారికి గడ్డం గీయడమే కాదు... కేసీఆర్ సర్కారుకు గుండుకొట్టడం తెలుసునని హెచ్చరించారు.శనివారం హైదరాబాద్ గాంధీభవన్ ఆవరణలో నాయీబ్రాహ్మణులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దాసోజు క్షవరం చేసి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులు రాజకీయ చైతన్యం కలిగిన వారని చెప్పారు. జట్టు, గడ్డం కత్తిరిస్తూనే గ్రామాల్లోని రాజకీయాన్ని లోతుగా విశ్లేషించే తెలివిపరులని చెప్పారు. కేసీఆర్ నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 30వేల మోడ్రన్ సెలూన్లు, 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నాయీ బ్రహ్మణులకు ఎమ్మెల్సీ పదవి, బడ్జెట్లో రూ 250 కోట్లు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. వారికి కమర్షియల్ టారిఫ్ నుంచి డొమెస్టిక్ టారిఫ్కు కరెంటు బిల్లులు మార్చినట్టు అబద్దాలు చెప్పారని విమర్శించారు. జీవోనెంబర్ ఒకటిన విడుదల చేసినా, అది నేటికీ అమలు కాకపోవడం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, ఓబీసీ విభాగం చైర్మెన్ నూతి శ్రీకాంత్గౌడ్, నాయీ బ్రహ్మణ రాష్ట్ర నాయకులు కొలిపాక సతీష్ తదితర ముఖ్య నేతల పాల్గొన్నారు.