Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ అనుమతి మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడురోజులుగా కార్మిక గర్జన పాదయాత్రలో ఉన్న నాయకులను పోలీసులు అడ్డుకుని ఆదిబట్ల పారిశ్రామిక ప్రాంతానికి అనుమతించకుండా అరెస్టు చేయడాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తీవ్రంగా ఖండించారు. నాయకులను పోలీసులు అనాలోచితంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలనీ, కార్మికులు పనిచేస్తున్న పారిశ్రామిక ప్రాంతాలగుండా పాదయాత్ర కొనసాగించేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా కుదింపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావాలని కోరారు. రాష్ట్రంలో పాత కాలం నాటి జీవోలను సవరించి కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు.
పాదయాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు : తెలంగాణ వ్యకాస ఖండన
సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) విమర్శించింది. నాయకులను అరెస్టు చేయడం హక్కులను హరించడమేనని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు తెలిపారు. నిరంకుశంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు జరపాలని సూచించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే ఉద్యమంలో టీఆర్ఎస్ శ్రేణులు కలిసి రావాలని తెలిపారు.
అరెస్ట్ అక్రమం:జీటీ గోపాలరావు
కార్మిక హక్కుల కోసం, కనీస వేతనాల కోసం సీఐటీయూ నేతలు ఎస్.వీరయ్య, పాలడుగు భాస్కర్, భూపాల్, పి. జయలక్ష్మి చేపట్టిన కార్మికగర్జన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని అఖిలభారత రక్షణ ఉద్యోగుల ఫెడరేషన్(ఏఐడిఈఎఫ్) జాతీయ సహాయ కార్యదర్శి జీటీ గోపాలరావు ఖండించారు. బాలాపూర్లో పాదయాత్రను భగం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శిస్తున్నారు. అరెస్ట్లు అప్రజాస్వామికమని అన్నారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సీఐటీయూ పాదయాత్రపై పోలీస్ నిర్బంధం అప్రజాస్వామికం:కేవీపీఎస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కార్మిక గర్జన పాదయాత్ర నిర్వహిస్తున్న సీఐటీయూ రాష్ట్ర నేతలను అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ ఖండించింది. వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. పాదయాత్ర తిరిగి కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్వెస్లీ, టి స్కైలాబ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు పోలీసు నిర్బంధ చర్యలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.