Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
నవతెలంగాణ-చిట్యాల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం జరుపుకుంటామని నాడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్లవుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం చేశారన్నారు ఈ పోరాటంలో వందలాది మంది అమరులయ్యారన్నారు. గుండ్రాంపల్లిలో సుమారు 63 మంది కమ్యూనిస్టుయోధులను రజాకార్లు హతమార్చారన్నారు. న్యాయబద్ధమైన ప్రజాసమస్యల పరిష్కారం కోసం, ప్రజాహక్కుల సాధన కోసం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగిందన్నారు. గతంలో భూమిలేని నిరుపేదలకు సుమారు 10 లక్షల ఎకరాలను పంచి పెట్టామని, వాటికి ప్రభుత్వం ద్వారా హక్కులను కూడా సాధించి పెట్టామని, కానీ నేడు పాలకులు ఆ భూములను లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లోని పలు జిల్లాలు నిజాం ప్రభుత్వ ఆధీనంలో ఉండేవన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశంలో ఈ ప్రాంతాలు విలీనమయ్యాయన్నారు. కర్నాటక, మహారాష్ట్ర్రలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నా, తెలంగాణ మాత్రం దీనిని దూరం పెట్టడం దురదృష్టకరమన్నారు. అనంతరం గుండ్రాంపల్లిలో అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, పల్లా నర్సింహారెడ్డి, నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు, సృజన, లొడంగి శ్రవణ్కుమార్, గుడికి సైదులు, ఎండి అక్బర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.