Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్లో 'మెడిసిన్ ఫ్రం స్కై' ప్రాజెక్టు ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. వికారాబాద్లో డ్రోన్ సాయంతో మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన 'మెడిసిన్ ఫ్రం స్కై' ప్రాజెక్టును శనివారం మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. మూడు డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. ఔషధాలను వికారాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు డెలివరీ చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. డ్రోన్ టెక్నాలజీ మాత్రమే కాదని, విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించారు. డ్రోన్లో కొత్త ఆవిష్కరణ చూస్తున్నట్టు, మానవ మనుగడకు డ్రోన్లు ఈ విధంగా ఉపయోగపడడం సంతోషకరమన్నారు. దేశంలో తొలిసారి మందులను డ్రోన్ల ద్వారా పంపిణీ చేయడం ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం వేదిక అయిందన్నారు. ప్రతి గ్రామానికీ వైద్యం అందుబాటులోకి తీసుకరావాలని, మందులు, వ్యాక్సిన్లు అందజేయాలనే ఈ ప్రయత్నమన్నారు. వ్యాక్సిన్లు దూర ప్రాంతాలకు అందజేయడానికి ఇబ్బంది లేకుండా.. డ్రోన్ల ద్వారా చేసుకోవచ్చన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సామాన్యుడికి ఉపయోగం లేని సాంకేతికత వ్యర్థమన్నారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తుంటారని చెప్పారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామన్నారు. అధునాతన టెక్నాలజీతో మందులు సరఫరా చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేస్తామన్నారు. ఆరోగ్య రంగంలోనేగాక, అనేక రంగాల్లో డ్రోన్లు వాడొచ్చన్నారు. తొలిదశలో వికారాబాద్ జిల్లాలో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ..వికారాబాద్లో ఇలాంటి ప్రోగ్రాం ప్రారంభించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు సునితామహేందర్రెడ్డి, అనితారెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, వాణిదేవి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నరేందర్రెడ్డి, యాదయ్య, మహేశ్వర్రెడ్డి, రోహిత్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్, విద్య మౌలిక వసతుల సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నాగేంద్రగౌడ్, వికారాబాద్ గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మెన్ మురళీకృష్ణగౌడ్, వికారాబాద్ కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జడ్పీ వైస్ చైర్మెన్ విజరు కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పాల్గొన్నారు.