Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
- ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన నాయకులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయని అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్ట పోయిన రైతంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్, కొండాపూర్, సదాశివపేట మండలంలోని మిల్గిర్పేట్ గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సారంపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 7లక్షలు ఎకరాల్లో పంటల నష్టం జరిగిందన్నారు. సుమారు రూ.2500కోట్ల పంట నష్టం జరిగిందని.. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ.. ఇటీవలి వర్షానికి జిల్లాలో పత్తి, జొన్న, మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయ పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆడుకోవాలని డిమాండ్ చేశారు. పంటలను పరిశీలించిన బృందంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, అధ్యక్షులు బి.నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు రాజయ్య, నాయకులు రైతులు వెంకటేష్, కిష్టయ్య, అంజయ్య తదితరులు ఉన్నారు.