Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటోనగర్లో 347 మంది కార్మికులకు ప్లాట్లు
- ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
నవతెలంగాణ-హుజూరాబాద్
సామాన్యులపై గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి భారాలు మోపుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని, పన్నులు వేస్తున్న బీజేపీ వైపు ఉంటారా? ప్రజాసంక్షేమం కోసం పాటుపడు తున్న టీఆర్ఎస్ వైపు ఉంటారా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఆటోనగర్ నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. పట్టణం లోని 347ఆటోరంగ కార్మిక కుటుంబాలకు ఈ ఆటోనగర్లో ప్లాట్లు కేటాయించి, వారికి శాశ్వత వర్క్ షెడ్లు నిర్మిస్తున్నామన్నారు. కార్మికులు అద్దెలు చెల్లించనవసరం లేకుండా శాశ్వత ఆస్తిగా ఉంటుందన్నారు. టీఎస్ఐఐసీ ద్వారా ఆటోనగర్ కోసం రూ.3కోట్లు మంజూరు చేసామన్నారు. రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్ల వంటి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, హుజురాబాద్లోని మెకానిక్లందరూ ఇక్కడే ఉండేలా చూసుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సొంత స్థలాలు ఉంటే ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామని, స్థలం లేని వారికి ప్రభుత్వమే కట్టించి ఇస్తుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు ఎన్నికల డిపాజిట్ కడతామని మోటార్ వర్కర్స్ నేతలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ లబ్దిపొందిన 347 మంది ప్రభుత్వానికి అండగా ఉండి గెల్లు శ్రీనివాస్ను ఆశీర్వదించాలని కోరారు.దేశంలో నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై బీజేపీ ప్రభుత్వం భారాలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బొట్టుబిల్లలు, గోడ గడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని, సబ్సిడీ ఎప్పటిలాగే ఇస్తామని చెప్పాలని బీజేపీ నాయకులు హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వం రైల్వేలు, ఎల్ఐసీ, విమానశ్రాయాలు, నౌకాశ్రయాలు అమ్మి, కుదవపెట్టి ఉద్యోగాలన్నీ ఊడగొడతున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోతే రిజర్వేషన్లు పోయి.. పిల్లలకు ఉద్యోగాలు ఊడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జడ్పీ చైర్మెన్ కనుమల్ల విజయ, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల తదితరులు పాల్గొన్నారు.