Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-నల్లగొండ
నిజాం నిరంకుశ పాలనను తరిమికొట్టిన చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యంను ఆదర్శంగా తీసుకొని మహిళలు మరో సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని ఐద్వా కేంద్ర కమిటీ నాయకురాలు టి.జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ పిలుపునిచ్చారు. నల్లగొండలోని యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం ఐద్వా జిల్లా 12వ మహాసభ నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి ఆవిష్కరించారు. అనంతరం సభలో వారు మాట్లాడుతూ.. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నా.. నిత్యం ఏదో ఒక చోట లైంగిక దాడులు, హత్యలకు, హింసకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు.బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలపై వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు.కరోనాతో ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెంచి పేదలపై మరింత భారాలు వేయడం సరికాదన్నారు. ఉపాధిహమీ పనులను పట్టణ ప్రాంతాలకు వర్తింపజేసి అడిగిన వారందరికీ పనులు కల్పించాలని, రోజుకు రూ.600 చెల్లించాలని కోరారు. ఈ సభలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పోలెబోయిన వరలక్ష్మీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొండా అనురాధా, నిమ్మల పద్మ, దీపిక, తుమ్మల పద్మ, జిట్ట సరోజ తదితరులు పాల్గొన్నారు.