Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారిపై లైంగిక దాడి, హత్య
- బాధిత కుటుంబానికి నాయకుల పరామర్శ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేండ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగిక దాడి, హత్య చేయడం సంచలనం రేపింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి అదృశ్యమైంది. ఇంటి పక్కల నివాసముండే రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం శుక్రవారం లభ్యం కావడంతో దారుణం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికితరలించారు. చిన్నారిపై లైంగికదాడి చేసి,గొంతునులిమి హత్యచేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది.ఇదిలా ఉండగా.. శనివారం బాధిత కుటుంబాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు.నిందితుడు రాజును తమకు అప్పగించే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని బాధిత కుటుంబంతోపాటు బస్తీవాసులు శనివారం ఆందోళనకు దిగారు.నిందితున్ని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సాగర్ జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేసి.. బైటాయించారు. ఈ క్రమంలో స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి నచ్చజెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని, నెల రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.50 వేల చెక్కు అందజేశారు. అంతేకాక కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని, కలెక్టర్ పరిధిలో ఏం ఇవ్వగలమో అవన్నీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆందోళన విరమించా రు.ఇదిలావుండగా ఈ కేసు దర్యాప్తును ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతం చేస్తామని డీసీపీ రమేష్ రెడ్డి తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు చిన్నారి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
నిందితుడి అరెస్టు?
చిన్నారి ఘటనలో నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. యాదాద్రి జిల్లాలోని రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని అరెస్టు చేశారు. బాలికను తీసుకెళ్లిన రాజు ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టి.. అనంతరం గొంతునులిపి చంపేశాడు. తర్వాత పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తూర్పు మండలం డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని అదుపులోకి తీసుకుని రహస్యప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి..
చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలంటూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీపీసీసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మల్లురవి, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులతోపాటు గిరిజన సంఘాల నాయకులు రామ్ నాయక్, ధర్మ నాయక్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ నాయకులు బెల్లం నాయక్, యం.బాలు నాయక్, ఆర్.శేఖర్ నాయక్, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇందిర, నాయకులు లక్ష్మమ్మ, శశికళ, ఆలిండియా బంజారా సేవా సంఘం కేతావత్ పాపా నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు డబుల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి నిందితుడికి శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.