Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిషేధిత జాబితాలో భూములు
- దేవాదాయశాఖ సమీక్షలో మంత్రి ఏ ఇంద్రకరణ్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేవాదాయ భూముల పరిరక్షణకు అధికారులు చితశుద్ధితో పని చేయాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆలయ భూమికి దేవుడే యజమాని అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆలయ భూములపై సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో దేవుని పేరు మీద కొత్త పాస్ బుక్లు తీసుకోవాలని చెప్పారు. ధరణి వెబ్ సైట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితాలో ఆలయ భూములు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హై కోర్టు, దేవాదాయ శాఖ ట్రిబ్యునళ్లలో మెమోలు ఫైల్ చేసి, కోర్టు వాయిదాలకు తప్పనిసరిగా హాజరవ్వాలనీ, తుది ఉత్తర్వులు అనుకూలంగా వచ్చే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. దేవాదాయ భూములు కబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. శనివారంనాడాయన దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ భూముల లీజు వ్యవహారంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లీజు బకాయిల విషయంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. అన్ని దేవాలయాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కరోనా వల్ల దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గి, ఆదాయం గణనీయంగా పడిపోయిందనీ, దానికి అనుగుణంగా అనవసర వ్యయాలను నియంత్రించాలన్నారు. సేవలకు ఉపయోగించని ఆభరణాలను గోల్డ్ డిపాజిట్ స్కీం క్రింద జమ చేయడంతో పాటు రక్షణతో కూడిన అధిక వడ్డీ వచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇంఛార్జి అడిషనల్ కమిషనర్ కష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.