Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణనీయంగా తగ్గిన సాధారణ ప్రసవాలు
- ఆపరేషన్లతోనే మూడొంతుల కాన్పులు
- ప్రయివేట్ ఆస్పత్రుల్లో 90% సిజేరియన్లే..
- ప్రభుత్వ దవాఖానల్లో 60% ఆపరేషన్లు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రసవ వేదన పడకుండా.. సులభంగా ప్రసవం కావాలనే ఆలోచనలు పెరిగిపోవడంతో కడుపు కోస్తేనే.. కాన్పు దుస్థితి ఎక్కువవుతోంది. సిజేరియ న్తో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు, వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. తిథులు.. నక్షత్రాలు.. మంచి రోజులు అనే పోకడలూ పెరిగిపోయాయి. దాంతో ఆ సమయానికి సిజేరియన్ చేయించుకుంటున్నారు.. మంచి సమయ ం చూసుకుని రావాలంటూ ప్రయివేట్ ఆస్పత్రుల్లో గర్భిణి కుటుంబాలకు చెప్పి మరీ చేస్తున్నారు. ఫలితంగా సాధారణ ప్రసవాలు గణనీయంగా తగ్గుతున్నాయి. మూడొంతుల ప్రసవాలు సిజేరియన్తో అవుతుంటే ఒకవంతు, ప్రయివేట్ ఆస్పత్రుల్లోనైతే అరవంతు ప్రసవాలు కూడా సాధారణమైనవి ఉండటం లేదని వైద్యారోగ్యశాఖ నివేదికలు తెలుపుతున్నాయి. కాసుల వ్యామోహంతో ప్రయివేట్ ఆస్పత్రులు సిజేరియన్లు చేస్తుండటంతో.. రెండో కాన్పు అనివార్యంగా ఆపరేషన్ చేయాల్సి వస్తోందని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. ప్రయత్నం చేస్తున్నా సాధారణ ప్రసవాలకు గర్భిణులు సైతం సహకరించని సందర్భాలుంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
క్రమేణా పెరుగుతున్న సిజేరియన్లు
ఖమ్మం జిల్లాలోని 37 ప్రభుత్వ ఆస్పత్రులు, హెల్త్సెంటర్లకుగాను ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు.. 28 ఆస్పత్రుల్లో 8,477 ప్రసవాలు జరగ్గా.. అందులో 5,221 (62.36%) సిజేరియన్, 3,256 సాధారణ ప్రసవాలు ఉండటం గమనార్హం. ఏప్రిల్ 2021 నుంచి ఈనెల 9వ తేదీ వరకు 3,560 ప్రసవాలకుగాను 2,068 సిజేరియన్, 1,492 సాధారణ ప్రసవాలు ఉన్నాయి. ఐదునెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన కాన్పుల్లోనే 72.14% సిజేరియన్లు ఉంటే.. ప్రయివేట్ ఆస్పత్రుల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019-20లో మొత్తం 9,631 కాన్పులైతే వాటిలో 5,376 సిజేరియన్, 4,255 సాధారణ ప్రసవాలున్నాయి. అంటే ఏడాది కాలంలో 79.14% కాన్పులు ఆపరేషన్ చేసి పిల్లలను బయటకు తీసినవే. ఇక ఏడాది కాలంలో 15వేలకు పైగా సిజేరియన్ చేయగా 1,500 కూడా సాధారణ కాన్పులు చేయకపోవడం గమనార్హం.
జిల్లాలో అత్యధిక గర్భిణీ కేసులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికే వస్తుంటాయి. 2019-20లో 8,207 మంది ప్రసవం కోసం ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. వారిలో 65% మందికి సిజేరియన్తో కాన్పు చేశారు. 4,964 మందికి సిజేరియన్ చేయగా 3,243 మందికి సాధారణ ప్రసవం అయింది. ఈ ఐదునెలల్లో 3,252 మంది గర్భిణుల రాగా.. 1,293 మందికి మాత్రమే సాధారణ ప్రసవం, మిగిలిన 1959 మందికి సిజేరియన్తో కాన్పు చేశారు. 66% మందికి ఆపరేషన్ చేశారన్నమాట.
ప్రయివేట్లో ఫీజుల మోత...
కాన్పు కోసం ప్రయివేట్ ఆస్పత్రులకు వచ్చిన వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కోవిడ్ వ్యాప్తి తర్వాత ఈ వసూళ్లు మరింత అధికం అయ్యాయి. గతంలో పెయిన్లెస్ సిజేరియన్కు రూ.20వేల నుంచి రూ.30వేలు తీసుకున్న ఆస్పత్రి నిర్వాహకులు ఇప్పుడు రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. కరోనా నేపథ్యంలో పుట్టే పిల్లలు, బాలింతలు, ఆపరేషన్ థియేటర్ మొదలు మొత్తం నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామనే పేరుతో ఈ అదనపు వసూళ్లు చేస్తున్నారని బాధితులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వివిధ కారణాలు చూపి రూ.70వేల వరకు వసూలు చేస్తున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రెండో కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. మొదటి కాన్పుకు ప్రయివేట్లో సిజేరియన్ కాబట్టి.. రెండో కాన్పు ఎక్కువ కేసుల విషయంలో అనివార్యంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. కారణాలేవైనా కడుపు కోస్తేనే కాన్పు పరిస్థితి నెలకొనడంతో దీర్ఘకాలంలో మహిళల ఆరోగ్యంపై ఆ ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణ ప్రసవాలకు కేసీఆర్ కిట్ దోహదం
2017, జూన్ 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని గర్భిణుల కోసం ప్రారంభించింది. దీని ద్వారా గర్భిణులు మూడు దశల్లో రూ.12,000 వరకు లబ్ది పొందవచ్చు. ఒక శిశువు,అదీ అమ్మాయి అయితే రూ.1,000 అదనంగా ఇస్తారు. ఇలా రూ.13,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకాన్ని రెండు డెలివరీల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ పథకంతో కొంతమేర ప్రభుత్వ ఆస్పత్రుల వైపు గర్భిణులు మొగ్గుచూపుతున్నారు. ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీలు గర్భిణులకు అందుబాటులో ఉంటూ పోషకాహారంతో పాటు అవగాహన పెంపొందిస్తు ండటంతోనే ఈ మాత్రమైనా సాధారణ డెలివరీలు జరుగుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రెండో కాన్పుకు వస్తున్నారు
- డాక్టర్ వెంకటేశ్వర్లు- జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్
మొదటి కాన్పు ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేయించుకున్న వారు .. రెండో కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారు. అలాంటి వారికి సోధారణ ప్రసవం చేయడం ఎక్కువ సందర్భాల్లో సాధ్యం కావడం లేదు. డబ్బున్నా లేకపోయినా.. అప్పోసప్పో చేసైనా మొదటి కాన్పు ప్రయివేట్ ఆస్పత్రుల్లో చేయించుకుంటున్నారు. రెండు కాన్పులకు డబ్బులు వెచ్చించడం భారం కావడం.. కేసీఆర్ కిట్, కాన్పుకు అయ్యే ఖర్చు రూ.20వేల వరకు ఆదా అవుతుండటంతో రెండో కాన్పుకు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో
సాధారణ, సిజేరియన్ ప్రసవాల వివరాలు..
సంవత్సరం సాధారణ సిజేరియన్ మొత్తం సిజేరియన్
కాన్పుల శాతం
2019-20 4,255 5,376 9,631 72.14
2020-21 3,256 5,221 8,477 62.36
2021 (ఐదునెలలు) 1,492 2,068 3,560 79.14
ప్రయివేట్ ఏడాదికి 1,500 13,500 15,000 90.00