Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీతం ఇవ్వరూ.. కొనసాగించరూ
- 16 నెలలైనా పైసా లేదు
- గెస్టు రినివల్స్ రాదు
- ఇంటర్ కళాశాలల్లో లెక్చరర్ల కొరత
- రెన్యువల్, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
- గెస్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
కార్పొరేటు కళాశాలల దాటికి కుదేలైపోతున్న ప్రభుత్వ ఇంటర్ విద్యాసంస్థలను బలోపేతం చేయడంలో అతిథి అధ్యాపకులది ప్రముఖ పాత్ర. అంకితబావంతో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వారికి 16 నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగ బద్రత లేకున్నా.. పనికి తగ్గ వేతనం అందడం లేదు. అయినా నిత్యవిద్యార్థులుగా నిబద్దతతో ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కాలేజీల్లో గెస్టు లెక్చరర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి 2012 నుంచి ఈ అతిథి లెక్చరర్ల వ్యవస్థను ప్రారంభించారు. పీరియడ్కు రూ.150 చొప్పున నెలకు 72 పీరియడ్స్ బోధిస్తూ.. రూ.10,800 వేతనంతో కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ 2017లో ఒక పీరియడ్కు రూ.300కు పెంచడంతో నెలకు రూ. 21600ల వేతనం అయింది. అయితే, మళ్లీ వారిని పట్టించుకోకపోవడంతో అదే వేతనంతో ఎనిమిది ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కళాశాలలు తెరవక.. జీతం లేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తమ దీన స్థితిని ఇంటర్ బోర్డు మార్చాలని, వెంటనే అతిథి లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 60 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 280 మంది గెస్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 22 కళాశాలలున్నాయి. అందులో 80 గెస్టు లెక్చరర్లు ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 16 కళాశాలల్లో 73 మంది, వనపర్తి జిల్లాలో 12 కళాశాలలు 40 మంది, గద్వాల జిల్లాలో 10 కళాశాలల్లో 60 మంది గెస్టు లెక్చరర్లు ఉన్నారు. కొల్లాపూర్, కోడేరు, అచ్చంపేట లాంటి ప్రాంతాల్లో మొత్తం గెస్టు లెక్చరర్లే ఉన్నారు. ఒక ప్రిన్సిపాల్ మాత్రమే ప్రభుత్వ విభాగానికి చెందిన వారు. గత ఏడాది ఆన్లైన్ తరగతులు ప్రారంభం నుంచి గెస్టు లెక్చరర్లు బాధ్యతగా ఉన్నారు. అడ్మిషన్లో కీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి అతిథి అధ్యాపకులను ప్రభుత్వం రెన్యువల్ చేయడం లేదు. ఐదు మందితో ఉన్న రాష్ట్ర కమిటీ గతంలో అతిథి అధ్యాపకులను ఆటో రెన్యువల్ చేసేది. 2018 నుంచి కమిటీతో వివాదాలకు తావులేకుండా.. ప్రభుత్వమే నోటిఫికేషన్ వేసి.. ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తోంది. ఆ ప్రక్రియ ఈసారి ఇంకా చేయడం లేదు. 16 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. అయితే, ప్రభుత్వంలోని ఐదు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెన్యువల్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు, ఎంటీఎస్ లెక్చరర్లు, పార్ట్టైమ్ లెక్చరర్లకు రెన్యువల్ ఇవ్వకపోడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 1658 మంది లెక్చరర్లు రోడ్డునపడ్డారు.
పెండింగ్ వేతనం ఇచ్చి ఆదుకోవాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేయడానికి అరకొర వేతనాలతో కష్ట పడుతున్నాం. కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులను సైతం పర్యవేక్షించాం. ప్రభుత్వ కళాశాలల బాగుకోసం నమ్మకంతో సేవలు అందించాం. 16 నెలలుగా వేతనాలివ్వకుంటే ఎలా బతకాలి.. ఇప్పటికైనా గెస్టు లెక్చరర్లను రెన్యువల్ చేసి.. పెండింగ్ వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం.
అతిథి అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకులు- సదానందంగౌడ్
- గెస్ట్ లెక్చరర్ గణేష్ ఆత్మహత్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బాటనీ గెస్ట్ లెక్చరర్గా పనిచేసిన గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 18 నెలలైనా జీతాలు రాకపోవడం, ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంకా విధుల్లో తీసుకోకపోవడంతో మనస్థాపానికి చెంది ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనీ, ప్రభుత్వం, ఇంటర్ బోర్డు బాధ్యతగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అతిధి అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ పాషా డిమాండ్ చేశారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఆయన కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని అతిధి అధ్యాపకుల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్ యాదవ్ కుంట డిమాండ్ చేశారు. గణేష్ మరణం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ సంతాపం, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.