Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పులున్నాయనే సాకుతో పక్కకుపెట్టిన పాత రిపోర్టు
- వివరాలు వెల్లడించని అరవింద్ పనగారియా కమిటి
- రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషి
- రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు
కుల గణనపై కేంద్ర తాత్సారం చేస్తున్నదనీ, దీనిపై మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదనీ, గణన జరిగితేనే వెనుకబడిన తరగతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. 'పులులు, జింకల లెక్కలున్నాయిగానీ.. మనుషుల లెక్కలు స్పష్టంగా లేవు. ఇది బాధాకరం. వెనుకబడిన తరగతుల వారు ఎలా జీవిస్తున్నారు? వారి ఆర్థిక నేపథ్యం ఎలా ఉంది? సామాజిక స్థితి ఎట్లుంది? వివక్షత ఉందా? లేదా? విద్యారంగంలో జనాభా ప్రకారం అవకాశాలు లభిస్తున్నాయా? లేదా? అనే విషయాలు కుల గణన ద్వారానే బయట పడతాయి. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ అంశాన్ని కేంద్రం పట్టించుకోవాలి. తాత్సారం తగదు. ఈ ప్రభావం సహజంగానే అన్ని రాష్ట్రాలమీద ఉంటుంది. ఇప్పటికైనా ఆ వైపుగా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది' అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా పటిష్ట కార్యాచరణతో బీసీ కమిషన్ క్రియాశీలకంగా పనిచేస్తు న్నదని వివరించారు. అంకిత భావంతో పనిచేసి తెలంగాణకు పేరు తెస్తామనీ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తా మని వెల్లడించారు. గత కమిషన్ అత్యంత వెనుకబడిన 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలంటూ సిఫార్సు చేయగా ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మె న్గా పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి ఎస్.వెంకన్నకు వకుళాభరణం ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
కేంద్రం కులగణన చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నది?
కుల గణనలో తప్పులున్నాయనే సాకుతో రాష్ట్రాల వారీగా, దేశవ్యాప్తంగా కులాల వివరాలను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. ఎందుకు చేయలేదంటే.. ఇంటి పేర్లు, గోత్రాలు, కొంత వైవిద్యం ఉన్న కారణంగా సవరించి మళ్లీ ప్రకటిస్తామని చెప్పి తొలి నిటిఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియాతో కేంద్రం ఒక కమిటీ వేసింది. ఆ కమిటి ఇంత వరకు ఏం తేల్చలేదు. అసలు ఆ కమిటీ రిపోర్టు ఇచ్చిందా? లేదా? అనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి తెల్వదు. ఈ నిర్లక్ష్యాన్ని వీడి ఇప్పటికైనా కుల గణన చేపట్టాలని దేశంలోని రాజకీయ పార్టీలు,సామాజిక సంఘాలు కోరుతున్నాయి.
చివరిసారిగా కులగణన ఎప్పుడు జరిగింది?
ప్రస్తుతం దేశంలో బీసీ జనాభా 56శాతంగా ఉంది. 1931లో నాడు బ్రిటిషు ప్రభుత్వం కులాల వారీగా గణన చేసింది. ఆ లెక్కలే స్వాతంత్య్ర వచ్చిన తర్వాత కూడా ఉజ్జాయింపు అంచనాతో ప్రతి కమిషన్కు, ప్రభుత్వానికి లెక్కలు ఇస్తున్నారు. 1991లో మండల్ కమిషన్ సిఫారసులను విపి సింగ్ అమల్లోకి తెచ్చిన తర్వాత 1993లో వాటిపై జడ్జిమెంట్ వచ్చింది. 1931 లెక్కలమీద ఆధారపడటం ఏంటి? అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రశ్నించింది. గణన చేయండని చెప్పి ఆదేశించింది. ఏ కారణాల చేతనోగాని కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ముందడుగు వేయడం లేదు. దీంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. విచిత్రమేమంటే... ఈ దేశంలో పులులు, జింకలు ఎన్నున్నాయో లెక్కలున్నాయి. కానీ..మనుషులకు సంబంధించిన లెక్కలు అసలే లేవు. ఇప్పుడు వారు ఎట్లా జీవిస్తుండ్రు. వారి ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? సామాజిక నేపథ్యం ఏమిటి? వివక్షత ఉందా? లేదా? విద్యారంగంలో జనాభా ప్రకారం అవకాశాలు లభిస్తున్నాయా? లేదా? అనేవి గణనద్వారా బయటపడతాయి. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా పాత లెక్కల ఉజ్జాయింపు లెక్కలతో నిర్ణయాలు తీసుకోవడం తగదు.
అసలు కుల గణన వలన లాభం ఏంటి?
కుల గణన లేకుండా ప్రస్తుతం ఏ నిర్ణయాలూ తీసుకోలేము.సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమా లు కావచ్చు, రిజర్వేషన్ల శాతం పెంపుదల కావచ్చు, కుల జాబితాలో చేర్పులు మార్పులు కావచ్చు, అది ఏవైనా కుల గణన ఉంటే.. సంబంధిత కులాన్ని దాని స్థితిని బట్టి 'ఏ' నుంచి 'బి' కి లేదా మరే క్యాటగిరిలోకైనా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఇది లేకపోతే ఈ ప్రక్రియ ఆగిపోతది కదా? ఈ ప్రాధాన్యత రీత్యా మొదటి కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్,ఉమ్మడి రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్,మురళీధర్ రావు కమిష న్..ఇలా కమిషన్లన్నీ జనాభా గణన జరగాలని చెబుతున్నాయి.ఇంతెందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా అడుగుతున్నాయి కదా? అయినా తాత్సారం చేయడం బాధాకరమే. ఇది ప్రమాదం కూడా. 50శాతం రిజర్వేషన్ల లక్ష్మణ రేఖను దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఉజ్జాయింపు లెక్కల మీద ఆధారపడి గుడ్డిగా నిర్ణయాలు తీసుకోలేం కదా?అందుకే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి సంబంధించిన అంశాలపై పరిమాణాత్మక సమాచా రం ఉండాలి.రిజర్వేషన్ల శాతం పెంచాలన్నా, తగ్గించాలన్నా, సాధికారికత కలిగిన సమాచారం అవసరం.దీన్ని మాత్రమే న్యాయస్థానాలు పరిగణ లోకి తీసుకుంటాయి.సామాజిక,విద్యా,ఉపాధి రంగా ల్లో మా కమిషన్ కూడా సర్వే చేసిందనీ, సర్వే సమాచారం మా దగ్గర ఉందనీ, ఈ రెండింటిని క్రోడీకరించి మేమొక నిర్ణయానికి వచ్చామని కోర్టుల కు చెప్పగలగాలి. అందుకు ఈ గణన అవసరం. ఆ రకంగా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది.
కుల గణనలేని పరిస్థితుల్లో చైర్మెన్గా మీ కర్తవ్యాలు?
చట్టబద్ధ కమిషన్గా బీసీల అభ్యున్నతికి కొత్త బాటలు వేయడమే మా కర్తవ్యం. రాష్ట్రంలోని జనాభాలో సగానికి పైగా బీసీలే. అందరూ కుల వృత్తిదారులు. కష్టజీవులు. సంచార, అర్థసంచార, విముక్త కులాల వారున్నారు. వారిలో సామాజిక వెనకబాటుతనాన్ని దూరం చేసి, ఎలాంటి వివక్ష లేకుండా సమానావకాశాలు కల్పించడం ద్వారా న్యాయం చేయాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది. ఈ కృషిలో బీసీ కమిషన్ భాగస్వామిగా నిలుస్తుంది. బీసీ కమిషన్గా బీసీల వాస్తవ స్థితిగతులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
బీసీల కోర్కెలు ఎలా ఉన్నాయి? వాటిని మీరు గుర్తించారా?
గుర్తించినం. బీసీలు వాళ్లున్న స్థితితో సామాజిక, ఆర్థిక ప్రగతి కావాలని కోరుకుంటున్నారు.వెనకబాటు తనాన్ని అధిగమించేందుకు వీలుగా అంతర్గతం గా గ్రూపుల మార్పిడిని కోరుతున్నారు. బీసీ జాబితాలోచే ర్చాలని పలు కులాలు అడుగుతున్నాయి .కొందరు కులాల పేర్లు మార్చాలని విన్నవిస్తు న్నారు.కొందరు గ్రూపులు మార్చి రిజర్వేషన్ల అమలును అడుగుతున్నారు.ఈ సమస్యల పరిష్కారం కోసం మా పరిధిలో ఉన్న అధికారాల ఆధారంగా పనిచేస్తాం.ఇప్పటికే గత బీసీ కమిషన్ కొన్ని పరిష్కారాలు చేసింది. మిగిలిన వాటిని మేం పూర్తి చేస్తాం. ఎక్కడ ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి వస్తే స్పందిస్తాం.నాఅనుభవాన్నంతా వినియోగించి,నిరం తరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.కమిష న్కు,రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెస్తా.