Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న భారత్బంద్ను సంపూర్ణంగా జయప్రదం చేయాలి
- అక్టోబర్ 5న పోడు రైతు 400 కిలోమీటర్ల రాస్తారోకో
- ప్రజలంతా భాగస్వాములు కావాలి
- కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, న్యూడెమోక్రసీలు, టీజేఎస్ నేతల పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈనెల 20 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఢిల్లీలో సమావేశమైన 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోనూ ఆ కార్యక్రమాలు అమలు చేయడం కోసం శుక్రవారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీల నేతలు సమావేశమయ్యారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో మల్లు రవి (కాంగ్రెస్), తమ్మినేని వీరభద్రం, డిజి నరసింహారావు (సీపీఐఎం), చాడ వెంకట్రెడ్డి, పశ్యపద్మ, ఎన్ బాలమల్లేష్ (సీపీఐ), వేములపల్లి వెంకట్రామయ్య (సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ), సాదినేని వెంకటేశ్వరరావు, కె గోవర్ధన్ (సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ), కోదండరామ్ (టీజేఎస్) పాల్గొన్నారు. ఈనెల 22న ఉదయం 11 నుంచి హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అదేనెల 27న సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భారత్బంద్ను హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో సంపూర్ణంగా జయప్రదం చేయాలనీ, వ్యాపార వర్గాలు, వాణిజ్యసముదాయాలు, అన్ని వర్గాల ప్రజలూ సహకరించాలనీ, భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల 5న పోడు రైతు రాస్తారోకో జరుగుతుందని ప్రకటించారు. పోడు సాగు ప్రాంతాలన్నింటిలో 400 కిలోమీటర్ల భారీ రాస్తారోకో జరగాలనీ, పోడు గ్రామాలన్నింటి నుంచి సాగుదార్లు, వారికి మద్దతుగా ప్రజలు రోడ్లపై బైఠాయించాలనీ, ఆరోజు ప్రయాణాలు రద్దు చేసుకుని ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఇతర ప్రతిపక్షాలు, శక్తులు కలిసి రావాలి : తమ్మినేని
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఐక్యంగా పోరాడేందుకు ఇతర ప్రతిపక్ష పార్టీలు, శక్తులు, సంఘాలు, వ్యక్తులు కలిసి రావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఇది ప్రతిపక్ష పార్టీల సమస్య కాదనీ, దేశం, ప్రజల సమస్య అని అన్నారు. దేశంలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం ఉందన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి ఉన్న వనరులు, అవకాశాలను వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం అనుసరించిన పద్ధతితో వచ్చే ఏడాది ఆఖరు వరకు దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ను అందించలేమని చెప్పారు. ఇంకోవైపు థర్డ్వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలనీ, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనీ, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్ బాధితులకు, మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలనీ, కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలని సూచించారు. వ్యవసాయరంగాన్ని కబళించే మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటుసంస్థలకు లీజుకిస్తే ప్రజలపై భారాలు మోపుతాయని అన్నారు. పోడు రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వారికి అండగా నిలబడాలని చెప్పారు.
18న రేవంత్రెడ్డి నేతృత్వంలో సమావేశం : మల్లురవి
ఢిల్లీలో సోనియాగాంధీ నేతృత్వంలో 19 ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నేతృత్వంలో ఈనెల 18న మరో సమావేశం జరుగుతుందనీ, మహాధర్నా, భారత్బంద్ను విజయవంతం చేయడంతోపాటు, కలెక్టరేట్ల ముట్టడి, ఇతర కార్యక్రమాలపై నిర్దిష్ట కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నదని విమర్శించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాతో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు దెబ్బతిన్నాయనీ, లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీని 200 రోజులకు పెంచాలనీ, కూలిని రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి చెక్ పెట్టాలి : చాడ
బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.లేకపోతే భవిష్య త్తులో ప్రజలపై మరిన్ని భారాలు మోపుతుందనీ, హక్కులు కాలరాయబడతాయనీ,కార్పొరేటీకరణ మరింత వేగవంతం అవుతుందని చెప్పారు.ప్రజా పోరాటాలతో బీజేపీ విధానాలను ఎండగట్టాలని అన్నారు.దేశానికి స్వావలంబన దిశగా కాకుండా పరాధీనం వైపు మోడీ విధానాలు వెళ్తున్నాయని చెప్పారు.జాతీయ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారనీ,ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుప రం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల భాగస్వామ్యంతో సమరశీల ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ ఉద్యమం గుర్తుకొస్తున్నది : వివి
ప్రతిపక్ష పార్టీల సమావేశం విద్యుత్ ఉద్యమాన్ని గుర్తుకుతెస్తున్నదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య (వివి) అన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని కోరారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయరంగంతోపాటు ప్రభుత్వరంగ సంస్థలను, సంపదను దేశీయ, విదేశీ కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నాదని విమర్శించారు. ప్రజల హక్కుల దాడి చేస్తున్నదని చెప్పారు. ఆహారభద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు గ్యారెంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
కార్మిక కోడ్లను వెనక్కి తీసుకోవాలి : సాదినేని
కార్మికవర్గ హక్కులకు ఉరితాడు వేస్తూ కేంద్రం తెచ్చిన నాలుగు కార్మికకోడ్లను వెనక్కి తీసుకోవాలని (సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే ధరలు పెంచి భారాలు మోపుతున్నదని విమర్శించారు. లాభాలు వచ్చే ప్రభుత్వరంగ సంస్థలనూ అగ్గువకు కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నదని చెప్పారు. ఈ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
ప్రజలంతా కదలాలి : కోదండరామ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కదలాలని టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదన్నారు. కోవిడ్ నియంత్రణకు, చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలనీ, పోడు రైతుల విషయంలో చర్యలు చేపట్టాలనీ, కోర్టులు అనేక సూచనలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. ధరలు తగ్గించాలనీ, కోవిడ్ వైద్యం అందించాలనీ, వ్యాక్సిన్ ఇవ్వాలనీ, చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 20 నుంచి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ, ప్రజలు సహకరించాలని కోరారు.
డిమాండ్లు :
- దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఉన్న సామర్థ్యాన్ని అంతటినీ అమల్లోకి తేవాలి. విదేశాల నుంచి వ్యాక్సిన్ను దిగుమతి చేసుకోవాలి. ఉచిత సార్వత్రిక సామూహిక టీకా ప్రక్రియను వేగవంతం చేయాలి.
- కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి. ప్రభుత్వ వైద్యవ్యవస్థను పటిష్టం చేయాలి.
- ఆదాయపు పన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికీ నెలకు రూ.7,500 నగదు అందించాలి. ఒక్కొక్కరికీ 10 కిలోల బియ్యం ఇవ్వాలి.
- పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధించి ఎక్సైజ్ డ్యూటీ, సర్ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలి.
- రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. ఉత్పత్తి వ్యయంలో 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరకు అమ్ముకునే హక్కు కల్పిస్తూ చట్టం చేయాలి.
- ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రయివేటీకరణను, మానిటైజేషన్ ప్రక్రియను ఆపాలి. మూసివేసిన పరిశ్రమలను తెరవాలి.
- కార్మికకోడ్లను రద్దు చేయాలి. సమ్మెహక్కును, వేతనాల కోసం బేరసారాల హక్కులను పునరుద్ధరించాలి.
- గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో 200 పనిదినాలు గ్యారెంటీ చేయాలి. వేతనాన్ని రెట్టింపు చేయాలి. పట్టణాలకు విస్తరింపజేయాలి.
- ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్ గూఢచర్య స్పైవేర్ వినియోగంపై సుప్రీం పర్యవేక్షణలో న్యాయవిచారణ జరపాలి.
- దేశద్రోహం, జాతీయ భద్రతా చట్టం వంటి దుర్మార్గ చట్టాలను ఉపసంహరించాలి. బీమా కోరెగావ్ కేసు, సీఏఏ వ్యతిరేక నిరసన కారులు సహా రాజకీయ ఖైదీలందర్నీ వెంటనే విడుదల చేయాలి.
- అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలను అమలు జరపాలి. పోడు భూములకు సాగు హక్కు పత్రాలివ్వాలి.