Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయప్రతినిధి
యాచారం పోలీస్ స్టేషన్లో నిరసన తెలుపుతున్న యాత్ర బృందానికి అఖిలపక్ష రాష్ట్ర నాయకత్వం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్, కాంగ్రెస్ నాయకులు బెల్యానాయక్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, పట్నం రాష్ట్ర అధ్యక్షులు డీజీ నర్సింహారావు, గిరిజన సంఘం శ్రీరామ్ నాయక , సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లాకార్యదర్శి రాంచందర్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మత ఘర్షణలు సృష్టించేందుకు హైదరాబాద్ నడ్డిబొడ్డున ఉన్న చార్మినార్, భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభించిన బీజేపీ నాయకుడి పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్కార్పెట్ పరిచి వారి యాత్రకు ఎలాంటి అటంకం కలగకుండా పోలీసు బందోబస్తుతో రక్షణ కల్పిస్తోందన్నారు.. ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించే యాత్ర నిషేధితంగా కనిపించని పోలీసులకు..కార్మికుల కష్టాలను తెలుసుకోవడానికి శాంతియుతంగా సాగుతున్న సీఐటీయూ యాత్ర ఎట్టా నిషేధితంగా కనిపించిందని ప్రశ్నించారు. సీఐటీయూ నాయకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలపెట్టారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. బంతిని ఎంత గట్టిగా నేలకు కొడితే..అంతకు రెట్టింపు ఎంతుకు ఎగురుతుందన్నారు. అదే మాదిరిగా కార్మిక ఉద్యమాలు ఎంత తొక్కేదామంటే.. అంతే స్థాయిలో ముందుకు సాగుతాయన్న విషయాన్ని పాలక వర్గాలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని, ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండని హెచ్చరించారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ కార్మికులు ఐక్యమయ్యే సమయం వచ్చింది, ఇక నుంచి అన్ని కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమాలు చేపట్టనున్నాయని తెలిపారు.. యాచారం నుంచే ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 19 పార్టీల కూటమితో దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఆ ఉద్యమాలకు సీఐటీయూ ఉద్యమం తొలి ఉద్యమంగా నిల్చిందన్నారు. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిని పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని కోర్టులు చీవాట్లు పెట్టినా ప్రభుత్వాలకు బుద్ధి రావడం లేదన్నారు. ప్రభుత్వాలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఐటీయూ నాయకులు ప్రభుత్వంపై యుద్ధం చేయడం లేదనీ, అయినా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాస్తు కేంద్రం కోడ్లను తెచ్చిందన్నారు. హక్కులను కాపాడాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న సీఐటీయూ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. పాదయాత్రను ముందుకు సాగనీయకూడదని ప్రభుత్వం భావించిందనీ, అందుకే నాయకులను అరెస్టు చేయించిందని చెప్పారు. ఉద్యమ నాయకులను అరెస్టులు చేయడం సరికాదని తెలంగాణ జన సమతి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ అన్నారు. కార్మికుల హక్కుల కోసం స్వరాష్ట్రంలో చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సాధన కోసం చేసిన ఉద్యమాలకు ఎన్ని పర్మిషన్లు తీసుకున్నారో ప్రస్తుత సీఎం కేసీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. ఉద్యమ నేతగా ఉద్యమకారులపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమో ముఖ్యమంత్రి సమాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ. టాటా ఏరోస్పేస్ కంపెనీ యాజమాన్యం కోసమే సీఐటీయూ నాయకులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. కొద్ది రోజుల నుంచి టాటా ఏరోస్పేస్ కంపెనీల్లో కార్మికులు తమ సమస్యలపై మాట్లడినందుకు దాదాపు 100 మంది కార్మికులను విధుల నుంచి తొలిగించారన్నారు. రాష్ట్ర కార్మిక బోర్డులో యూనియన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తున్న చేసుకుంటే ఎలాంటి కారణాలు చూపకుండా 9 సార్లు దరఖాస్తులను రిజెక్టు చేశారని అన్నారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా టాటా కంపెనీ యాజమాన్యానికి తొత్తుగా మారి.. శాంతి భద్రత కోసం ఉపయోగించాల్సిన పోలీసులను టాటా కంపెనీ కాపాల కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటన్నారు.
ఉంటే జనంలో..లేదంటే జైల్లో ఉంటాం
ఎన్ని అడ్డంకులు వచ్చినా యాత్ర అనుకున్న లక్ష్యాన్ని చేరాల్సిందే..పోలీసుల అరెస్టులు ఉద్యమాలను ఆపలేవు.. తిరిగితే జనంలో తిరుగుతాం.. లేదంటే జైల్లో ఉంటాం.. కానీ ప్రభుత్వ బెదిరింపులకు బెదిరి ఇంటికీ పోయి కూర్చునేది లేదు. ఇలాంటి అరెస్టులు మా ఉద్యమాలకు కొత్తేమి కాదు. కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు కార్మికుల సమస్యల కోసం యాత్ర చేస్తున్న సీఐటీయూ బృందాన్ని అడ్డుకోవడాన్ని యావత్ ప్రజానీకం అర్థం చేసుసకోవాలి.
- భూపాల్ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
యాజమాన్యాల కాసులకు కక్కుర్తి పడే అక్రమ అరెస్టులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాల కాసులకు కక్కుర్తిపడే కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్మిక నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. మూడు రోజులుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావు ఇవ్వకుండా ప్రశాంతంగా సాగుతున్న యాత్రకు కార్మికుల విశేష స్పందనను చూసి ఓర్వ లేని ప్రభుత్వాలు పోలీసులతో అరెస్టులు చేసి యాత్రకు భంగం కల్గిస్తున్నారు. ఇది ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనం. ప్రజాస్వామిక వాదులంత అక్రమ అరెస్టులకు ఖండించాలి.
- పాలడుగు భాస్కర్, సీఐటీయూ కార్యదర్శి
కనీసవేతనాలను వెంటనే అమలు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కనీసవేతనాలను అమలు చేయకుండా కార్మికుల హక్కులను కాలరాస్తుంది. వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తూ కనీసం ఈఎస్ఐ. ఫీఎఫ్ కలిపించకుండా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహిరిస్తున్నాయి. ఇలాంటి సమస్యలపై అద్యయనం చేసేందుకు కార్మిక వాడల్లో తిరిగేందుకు వచ్చిన సీఐటీయూ పాదయత్రను అడ్డుకోవడం చూస్తే పాలకవర్గాలు, బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకుస్తున్న విషయం ఇట్టే అర్థం అవుతుంది. రద్దు చేసిన కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించి.. 73 షెడ్యూల్ కంపెనీల్లో కార్మికులకు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి.
- జయలక్ష్మీ సీఐటీయూ ఉపాధ్యక్షురాలు
ఆదిబట్ల టాటా కంపెనీ భారత భూభాగంలో లేదా?
కార్మికుల హక్కుల కోసం సాగుతున్న యాత్రను వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న ఆదిబట్ల టాటా కంపెనీ ప్రాంతం నుంచి పోవద్దు అనడానికి టాటా ఏరోస్పేస్ కంపెనీ భారత భూభాగంలో లేదా?.. లేక ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు ఈ దేశ ప్రజలు కాదా ?.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తలకు తొత్తులుగా మారి..కార్మిక చట్టాలను రద్దు చేస్తూ.. పేదల శ్రమను దోచుకుంటున్నాయి. రాష్ట్రంలో వివిధ కంపెనీలల్లో పనిచేస్తున్న 1.20 లక్షల మంది కార్మికుల హక్కుల సాధన కోసం చేస్తున్న పాద యాత్రకు భంగం కల్గించడం.. ప్రభుత్వ నిరంకుత్వానికి నిదర్శనం. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాలు పెట్టిన కార్మికుల హక్కుల రక్షణ కోసం యాత్ర ముందుకు సాగుతుంది.
- ఎస్. వీరయ్య సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బృందం సభ్యులు