Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలాపూర్లో సీఐటీయూ పాదయాత్ర బృందం అరెస్టు
- రంగారెడ్డి జిల్లా యాచారం పోలీసు స్టేషన్కు తరలింపు
- ఇరువర్గాల మధ్య వాగ్వివాదం
- పోలీసులు ఇచ్చే మంచినీళ్లు కూడా ముట్టేది లేదంటూ నాయకులు నిరసన
- అధికార దాహంతో ఉద్యమాలను అడ్డుకోలేరన్న అఖిలపక్షం నేతలు
- తొక్కేకొద్ది...ఎదుగుతామన్న పాదయాత్ర బృందం సభ్యులు
- ఉద్యమం ఆగదని రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయప్రతినిధి/మీర్పేట్/ఆదిబట్ల
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నాలుగురోజులుగా పాదయాత్ర చేస్తున్న సీఐటీయూ నాయకులను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. పాదయాత్ర చేస్తున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చేరుకున్నారు. వారివెంట కార్మికులతో పాటు వివిధ ప్రజాసంఘాల నేతలు నడిచారు. స్వాతంత్రానికి ముందు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను..కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, 4కోడ్లుగా తేవడాన్ని, రాష్ట్ర ప్రభుత్వం పదేండ్లుగా వేతన సవరణ చేయకుండా యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్న తీరును కార్మికులకు తెలియపర్చేందుకు ఈ నెల 8న రంగారెడ్డి జిల్లా కొత్తూరు పారిశ్రామిక వాడ నుంచి ప్రారంభమైన సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్ర సాతంరాయి, గగన్పహాడ్, రాజేంద్రనగర్, కాటేదాన్, డీఆర్డీఎల్, డీఆర్డీఏ, మిధాని, బాలాపూర్ చౌరస్తా పారిశ్రామిక వాడల మీదుగా సాగిన పాదయాత్రకు ఆయా పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఇన్నాళ్లు యాజమాన్యాల చేతుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కార్మికులు పాదయాత్ర బృందానికి విన్నవించుకోవడం.. కార్మికుల్లో వస్తున్న చైతన్యాన్ని చూసిన పాలక వర్గాల గుండెల్లో రైళ్లు పరుగెట్టి..యాత్రను అడ్డుకునేందుకు ఒడిగట్టిన ప్రభుత్వం శనివారం బాలాపూర్ చౌరస్తాలో పాదయాత్ర బృందాన్ని అడ్డుకుని అరెస్టు చేసింది. సీఐటీయూ బృందం ప్రభుత్వం, పోలీసు అధికారుల నుంచి అన్ని అనుమతులను తీసుకుని శాంతియుతంగా చేస్తున్నామని పోలీసులకు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. వారిని బలవంతంగా పోలీసు వాహనంలోకి కుక్కి..సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారం పోలీసు స్టేషన్కు తరలించారు.
యాచారంలో దురుసుగా ప్ర్రదర్శించిన పోలీసులు
అరెస్టు చేసిన బృందాన్ని చిన్న గదిలో ఉంచడంతో.. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ.. పోలీస్స్టేషన్ ప్రాంగణంలో చెట్ల కింద కూర్చుంటామని బయటికి వచ్చిన బృందం సభ్యులపై పోలీసు అధికారులు దూరుసుగా ప్రదర్శించడాన్ని బృందం సభ్యులు ఖండించారు. ఈ సందర్భంలో మీడియా ప్రతినిధులు తీస్తున్న వీడియోలను, ఫొటోలను పోలీసు ఆధికారులు డిలీట్ చేయాలని.. వారి ఫోన్లు లాక్కునే ప్రయ్నతం చేయగా.. మీడియాను అడ్డుకున్న పోలీసులను, మీడియాను అడ్డుకోవద్దని నాయకులు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పత్రిక ప్రతినిధులకు కూడా ఫొటోలు, వీడియోలు తీసే స్వచ్ఛ లేదా.. వారిని అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారని పోలీసులను ప్రశ్నించారు.
పోలీసులు ఇచ్చే మర్యాదలను బహిష్కరించిన సీఐటీయూ
కార్మిక సమస్యలు తెలుసుకోవడానికి సాగుతున్న యాత్రను అడ్డుకుని పోలీసు స్టేషన్లో నిర్బంధించిన తమ కు మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు.. మా దారిన మమ్మల్ని పంపిస్తే కార్మికులు పెట్టే బువ్వనే తింటాం... వారి మధ్యే ఉంటామని పోలీసు స్టేషన్లో మంచి నీళ్లు కూడా ముట్టకుండ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ ఎదుట సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నిరసన
కార్మికుల హక్కులను పరిరక్షించాలని న్యాయమైన డిమాండ్లతో శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న సీఐటీయూ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ యాచారం మండల కేంద్రంలోని సాగర్ హైవే పై సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపై బయటించి పెద్ద ఎత్తున్న రాస్తారోకో నిర్వహించారు. సీఐటీయూ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు గంట సమయం పాటు ఆందోళన చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున్న వాహనాలు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అఖిలపక్ష నాయకులతో సంప్రదింపులు జరిపి అరెస్టు అయిన సీఐటీయూ నాయకులను పోలీసులు విడుదల చేశారు.. అనంతరం పోలీసులు, ప్రతిపక్ష నాయకులు, పాదయాత్ర బృందం సభ్యులు రాస్తారోకో చేస్తున్న ప్రాంతానికి చేరుకుని రాస్తారోకో కార్యక్రమాన్ని విరమింపచేశారు. అరెస్టులు, నిర్బంధం అధికార దాహంతో ఉద్యమాలను అడ్డుకోలేరు..ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న ఉద్యమాలను ఎంత అణచివేయాలని చూస్తే అంతకు రెట్టింపు స్థాయిలో ముందుకు సాగుతాయని..పేద కార్మికుల శ్రమను దోచుకుంటున్న బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని విడనాడాలని సీఐటీయూ పాదయాత్ర బృందం హెచ్చరించింది. అరెస్టులతో ఉద్యమం ఆగదని రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు చేపట్టారు.