Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి
- విలేకర్ల సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఇండిస్టీయల్ పార్కు పేరుతో రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరోకోబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అలగడప, అలగడప క్యాంపు, జాలుబాయితండా గ్రామాల్లో సుమారు 450 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, అది సరైనది కాదన్నారు. రైతుల అనుమతి, అభిప్రాయాలు లేకుండా భూములను సేకరించడం అన్యాయమని తెలిపారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా గ్రామ పంచాయతీ బోర్డులో నోటీసులంటించారని విమర్శించారు. ఈ మండలంలో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారనీ, ముఖ్యంగా జాలుబాయితండాలో గిరిజన రైతులు ఉన్నారనీ, వీరికి భూమే జీవనాధారమన్నారు. ఆ భూములే పోతే ఎట్లా బతకాలని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆ ప్రాంతాల్లో భూమి విలువ రూ.కోట్లలో ఉందనీ, అయినా ప్రభుత్వం నామమాత్రంగా నష్టపరిహారం ఇచ్చి రైతులకు అన్యాయం చేసేందుకు కుట్రపన్నిందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారనీ, ఈ విషయంపై రైతులపక్షాన పోరాడేందుకు పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయనీ, వాటిని వదిలేసి పట్టా భూములు లాక్కోవడం సరికాదన్నారు. పరిశ్రమల పార్కు ఏర్పాటుకు అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. రైతులు ఇప్పటికే కలెక్టర్, జిల్లా అధికారులకు కలిసి తమ గోడు విన్నవించుకున్నారనీ, రైతులను బలవంతం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు డాక్టర్ గౌతమ్రెడ్డి, పతాని శ్రీనివాస్, రామారావు పాల్గొన్నారు.