Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనసంక్షేమ ఉపాధ్యాయసంఘం మంత్రికివినతి
నవతెలంగాణ - పాల్వంచ
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్న తుల విషయం మరచిపోవాల్సిన పరిస్థితి కనపడుతున్నదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వి.రావు, రాములు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రాములోరి దర్శనానికి వచ్చిన గిరిజన స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు పాల్వంచలో మాట్లాడుతూ.. 2017 సంవత్సరంలో గుర్తించబడిన 1191 పోస్టుల ఊసే లేకుండా పోయిందన్నారు. ప్లేన్ ఏరియా జిల్లాల్లో ఆప్గ్రేడ్ చేసిన పాఠశాలల్లో 330 పోస్టుల భర్తీ జరగక పోగా, ఆయా పోస్టుల్లో విద్యా వాలంటీర్స్తో నెట్టుకొస్తున్నారని తెలిపారు. 601 పోస్టులకు నేరుగా నియామకం చేయాల్సి ఉండగా వాటినీ భర్తీ చేయడం లేదన్నారు. జిల్లాల్లోని కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలల్లో పోస్టులు మంజూరు చేయకుండా డిప్యూటేషన్స్తోనే నెట్టుకొస్తున్నారని తెలిపారు. స్కూల్స్ సజావుగా సాగనీయకుండా కన్వర్టెడ్ పాఠశాలలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. అలాచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. న్యాయంగా మాకు రావలసిన పదోన్నతులు రానీయకుండా కొందరు అధికారులు అడ్డుపడితే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెనకాడబోమన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికైనా గిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనీ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను కన్వర్టెడ్ పాఠశాలల్లో నియమించి ఆ పాఠశాలలు సజావుగా సాగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కారం సర్వేశ్వర దొర, శంకర్ నాయక్, రఘు, శంకర్ నాయక్, నరసింహారావు, కే. వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.