Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశలవారీగా ఆందోళన : టీడబ్ల్యూజేఎఫ్ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న 'డిమాండ్స్ డే' పాటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర విస్త్రృత సమావేశం తీర్మానించింది. దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు ఆదివారం హైదరాబాద్లో ఆ సంఘం విస్త్రృతస్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య గత కార్యకలాపాలు, భవిష్యత్ కర్తవ్యాలతోకూడిన నివేదికను సమర్పించారు. కరోనా లాక్డౌన్తోపాటు గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం పలు తీర్మానాలను ఆమోదించింది. తొలుత ఈ నెల 20న జర్నలిస్టుల డిమాండ్స్ డే పాటిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించాలనీ, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని సమావేశం జిల్లా కమిటీలను కోరింది. తమ సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్ళి పరిష్కరింపజేయాలని కోరుతూ 27 నుంచి వారం రోజుల పాటు ఆయా జిల్లా, నియోజకవర్గాలలో స్థానిక జర్నలిస్టులు తమ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని తీర్మానించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ లో వందలాది మంది జర్నలిస్టులతో ''ఛలో హైదరాబాద్'' కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి అక్టోబర్ 25 వరకు ఫెడరేషన్ జిల్లా మహాభలు నిర్వహించి, నవంబర్ 21న రాష్ట్ర మహాసభలు జరపాలని సమావేశం తీర్మానం చేసింది. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్లస్థలాలివ్వాలనీ, హెల్త్ కార్డుల కార్డులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలనీ, చికిత్స పొందుతున్నవారికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే చెల్లించాలనీ, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, అక్రమ కేసుల బనాయింపులను ఆపాలనీ, దాడుల నిరోధానికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చిన్న పత్రికలు, కేబుల్ టీవీ, వెబ్ చానళ్ళను ప్రభుత్వం గుర్తించి మరిన్ని అక్రిడిటేషన్లు ఇస్తూ ప్రోత్సహించాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, వి. జగన్, కార్యదర్శులు ఏవీఎన్ రావు, సలీమా, రాష్ట్ర, జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపూరావు, మెరుగు చంద్రమోహన్, విజయానందరావు పాల్గొన్నారు.