Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ధీర' పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ పోరాట ప్రకంపనలకు వందేండ్ల చరిత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మెన్ అయాచితం శ్రీధర్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని నవతెలంగాణ బుకహేౌస్లో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు అమర యోధుల త్యాగచరితలు 'ధీర' పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఆవిష్కరిం చారు. అనంతరం నవతెలంగాణ బుకహేౌస్ జనరల్ మేనేజర్ చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన సభలో అయాచితం శ్రీధర్ మాట్లాడారు. 1921లో ఆంధ్ర జనసంఘం, వర్తక సంఘం, ఆంధ్ర మహాసభలు విస్తరించి ఐలమ్మ పోరాటంతో రగిలి దొడ్డి కొమరయ్య ఆత్మార్పణతో సాయుధ రైతాంగ పోరాటం ఆరంభమైందన్నారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి పోరాట యోధులు నిర్మించిన అపూర్వ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.. ఇది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పోరాటం అని అన్నారు. ఈ పోరాటం ఎన్నో కళారూపాలను ప్రభావితం చేసిందన్నారు. మా భూమి నాటకం అత్యధిక ప్రదర్శనలు ఇచ్చిందని తెలిపారు. గొప్ప రచనలు, రచయితలు వెలుగులోకి వచ్చారనీ, వారి స్ఫూÛర్తితో ఇప్పటితరం పనిచేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాటం, త్యాగాలు అనుభవాలను నేటి తరానికి తెలియజేయాలన్నారు. స్వతంత్ర పోరాటంలో కానీ, సాయుధ పోరాటంలో కానీ ఎలాంటి పాత్ర లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు చరిత్రను వక్రీకరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. యోధుల చరితను, భగత్ సింగ్ వంటి వీరుల చరిత్రను చదవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈసందర్భంగా కమ్యూనిస్టు యోధుల త్యాగాల చరిత్ర 'ధీర' పుస్తకం అందించిన రచయితలను అభినందించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ గూగుల్పై ఆధారపడిన నేటి యువతకు జాతీయ నేతలు, సాయుధ పోరాట యోధుల చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కవి యాకూబ్ మాట్లాడుతూ.. ధీర పుస్తకంలో ఎందరో వీరుల చరిత్ర గురించి ఉందనీ, ఇది స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. సభకు కవులు తంగిరాల చక్రవర్తి ఆహ్వానం పలకగా మోహన్ కృష్ణ వందన సమర్పణ చేశారు. కాగా, పుస్తక ప్రదర్శనను ప్రముఖ కవి, రచయిత మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి, ఇల్లెందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య, రైతుసంఘం జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ, ఆదివాసీ నాయకులు బండారు రవికుమార్ తదితరులు సందర్శించారు. కార్యక్రమంలో బ్రాంచ్ ఇన్చార్జి రఘు, బుకహేౌస్ సిబ్బంది కృష్ణారెడ్డి, సుభాషిణి, సిద్దు తదితరులు పాల్గొన్నారు.