Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటల లెక్కలేనా? నష్టాన్ని తెలుసుకోరా?
- అన్నదాత కండ్లలో కన్నీళ్లు.. కదలని తెలంగాణ సర్కారు
- లక్షల ఎకరాల్లో పంటల్ని ముంచిన వరదలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వానకాలం సీజన్కు సంబంధించి రైతులు తమ పొలాల్లో ఏ పంటలు వేశారో, ఎన్ని ఎకరాల్లో వేశారనే అంశాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పుడు లెక్కలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం 15 రోజుల్లో పంటల లెక్కలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే నిన్న,మొన్నటివరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. చేతికొచ్చేదశలో పంటలు నీటిపాలు కావడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల లెక్కలు తీసుకుంటున్న సర్కారు.. నష్టపోయిన పంటల లెక్కలు మాత్రం తేల్చడంతో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. పాస్బుక్కుల ఆధారంగా సదరు రైతులు ఎన్నెకరాల్లో ఏయే పంట వేశారో తెలుసుకుని నమోదు చేస్తున్నారు. అందుకు ఆయా గ్రామాల్లో దండోరా వేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ వానాకాలంలో దఫదఫాలుగా కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా అతి భారీ వర్షాలు కురువడంతో దాదాపు 6.5లక్షల ఎకరాల్లో అది పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు రూ 12500 కోట్ల విలువైన పంట పాడైపోయిందనేది ప్రాథమిక అంచనా. అయితే అనధికారికంగా లెక్కలప్రకారం ఈ సంఖ్య మూడింతలు ఎక్కువగా ఉంటుందని రైతుసంఘాలు అంటున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. గతంలో పంటల నష్టాన్ని అంచనా వేసేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆయా పంటలను అంచనా వేసేవారు. సంబంధిత అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక రూపంలో ఇచ్చే ఆనవాయితీ ఉన్నది. 2015-16లో కేంద్రానికి, రాష్ట్రం నివేదిక పంపితే రూ 791 కోట్లు వచ్చాయి. అంతకు ముందుగానీ, ఆ తర్వాతగానీ ఎన్నో విపత్తులొచ్చినా ప్రభుత్వం ఎప్పుడూ కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదని తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత (2014 నుంచి 21వరకు) అనావృష్టి వల్ల దాదాపు రూ. 28వేల కోట్ల పంట నష్టం వాటిల్లిందని రైతు సంఘాల అంచనా. అందులో రూ. 3,500 కోట్లు ఇచ్చి సర్కారు చేతులు దులుపుకున్నది. అయితే 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి రూ 450 కోట్లు కేటాయించింది. అందుకు రాష్ట్ర సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ రూ 150 కోట్లు ఇస్తే...కేంద్రం నుంచి రూ 599 కోట్లు వచ్చేవి. ఇంతవరకు టీఆర్ఎస్ సర్కారు దీనిపై ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఫలితంగా కరువు, వరదలతో పంట నష్టపోతున్న రైతులకు ఎలాంటి పరిహారం అందడం లేదు. హుడా కమిటీ సిఫారుసుల ప్రకారం వాణిజ్య పంటలకు ఎకరానికి రూ 20వేలు, ఆహార ధాన్యాలకు రూ 10వేలు ఇవ్వాలి. పంటనష్ట పరిహారం పొందడంతో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
పత్తి ఆగమే
వానాకాలంలో ప్రభుత్వ సూచనమేరకు రైతులు అత్యధికంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. తొలకరిలో వానలకు విత్తనాలు వేసినా, వానలు లేక అవి మొలకెత్తలేదు. రెండోసారి మళ్లీ విత్తనం వేయాల్సి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఏపుగా పెరుగుతున్న క్రమంలో జులైలో వానలు ముంచెత్తాయి. అపారమైన నష్టాన్ని కలిగించాయి. తాజాగా పదిరోజులపాటు కురిసిన వానలకు పత్తి పంట దెబ్బతిన్నది. నీళ్లు నిలిచి చేలు ఎర్రబారుతున్నాయి. పూత రాలిపోతున్నది. పంట దెబ్బతినడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చే దశలో పంట మురిగిపోతున్నది. 45 కాయలు వచ్చే చెట్టుకు ఐదారు కాయలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. చెరువులు, కుంటలు తెగిపోయి వరినార్లు కొట్టుకుపోయాయి. ఇసుక మేటలు వేసింది. మిర్చి చేలు కూలిపోతున్నాయి. గాలివానలకు మక్కలు అడ్డంగా కూలిపోయాయని రైతు సంఘం పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో రైతును పలకరించే నాథుడే కరువయ్యాడు.