Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరి వద్దు... ధాన్యం కొనలేం
- జీవో 111 పరిధిలో కొత్త నగరం ఏర్పాటు : ప్రగతిభవన్ సమీక్షల్లో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతున్నందున రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభమైనా, కరోనా ప్రభావం పెద్దగా లేదని వైద్యాధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో వ్యవసాయం, వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాలు పైబడిన అర్హులు 2 కోట్ల 80 లక్షల మంది ఉండగా, ఇప్పటికే 1 కోటి 42 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్, 53 లక్షల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, మరో 1కోటి 38 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉందని ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని చెప్పారు.వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూళ్లు, కాలేజీ లు,రైతు వేదికలు తదితర ప్రభుత్వ, ప్రయివేటు భవనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగ అభివద్ధికి ప్రాధాన్యతనిచ్చిందని, ఇక ముందు వైద్యం,విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. నిమ్స్ పరిధిలో మరో రెండు టవర్స్ నిర్మించి వైద్య సేవలను విస్తత పరచాలని ఆదేశించారు.
వరి వద్దు
కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రగతిభవన్ లో జరిగిన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో అధికారులే ముఖ్యమంత్రికి సమస్యల్ని ఏకరువు పెట్టినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత వానాకాలంలో కూడా 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకోనేది లేదని కేంద్రం తేల్చి చెప్పినందున, ధాన్యాన్ని ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి అనుకూల పరిస్థితులు లేవని వారు ముఖ్యమంత్రికి చెప్పారు. రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేస్తున్నారని, సుమారు 1 కోటి 40 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనా ఉందన్నారు. ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం రైస్ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉందని అధికారులు వివరించారు. ఈ వర్షాకాలంలో రైతుల నుంచి కేంద్రం నిర్దారించిన 60 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరణ జరగాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్టు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రకటన తెలిపింది.
జీవో111 పరిధిలో మరో కొత్త నగర నిర్మాణం
జీవో 111 పరిధిలోని 84 గ్రామాల విస్తీర్ణం, 1 లక్షా 32 వేల ఎకరాల భూమి 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని, మరో కొత్త నగరం వైశాల్యంతో ఉన్నందున ఈ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రాంత పరిధి జీహెచ్ఎంసీ విస్తరించి ఉన్న ప్రాంతానికి సరిసమానమని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్కు అనుబంధంగా, హెచ్ఎండీఏ పరిధిలో విస్తరిస్తున్నందున మరో కొత్త నగర వైశాల్యం ఉన్నందున నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దాలని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. జలాశయాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉన్నందున, గ్రీన్ జోన్లు, సివరేజ్ మాస్టర్ ప్లాన్, తాగునీటి వ్యవస్థ, విశాలమైన రోడ్లు తదితర సదుపాయాలతో రాబోయే తరాలకు మంచి నగరం ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అధికారుల్ని ఆదేశించారు. జీవో 111 పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందనీ, కోర్టును మరింత వ్యవధి కోరాలని నిర్ణయించారు.