Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న భారత్ బంద్ విజయవంతం చేద్దాం : ఏఐకేఎస్సీసీ సన్నాహక రాష్ట్ర సదస్సులో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయకమిటీ (ఏఐకేఎస్సీసీ) రాష్ట్ర సన్నాహక సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. మోడీ పీఠం కదిలించేలా 27న భారత్ బంద్ నిర్వహించాలని కోరారు. ఈచట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజికసంఘాలు, కార్మిక, కూలీ, మహిళా, యువజన, విద్యార్థి సంఘాలు, వాణిజ్యవర్గాలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. నల్ల చట్టాలతో కేవలం రైతులకే నష్టం జరగదనీ, ప్రజా ప్రయోజనాలకే ప్రమాదం ముంచుకు రాబోతున్నదని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎస్సీసీ ఆధ్వర్యంలో 'రైతు వ్యతిరేక చట్టాలు రద్దు-కనీస మద్దతు ధరల చట్టం కోసం, మోడీ ప్రభుత్వ దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ 27 భారత్ బంద్ను పురస్కరించుకుని రాష్ట్ర సన్నాహక సదస్సు జరిగింది. ఏఐకేఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్ టి సాగర్ మాట్లాడుతూ ఆగస్టు 26, 27 తేదీల్లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్వహించిన జాతీయ సదస్సు పిలుపుమేరకు మన రాష్ట్రంలో భారత్ బంద్ సంపూర్ణంగా నిర్వహించాలని సూచించారు. అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధరల చట్టం సాధన కోసం ఉద్యమించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించలేదన్నారు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పోడు సాగుదార్లకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగం ప్రయివేటికరణ వేగవంతమవుతున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ మాట్లాడుతూ అప్రజాస్వామికంగా, నిరంకుశంగా నల్ల చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. రైతాంగ ఉద్యమంలో 600 మందికి రైతులు అసువులుబాశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కన్వీనర్ రాయల చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమానికి ప్రపంచ మద్దతు లభించడం మంచి పరిణామన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఉద్యమం జరగడంలేదనీ, ఈచట్టాలతో దేశానికే ఉపద్రవం ముంచుకొస్తున్నదని చెప్పారు. రాష్ట్ర కన్వీనర్ అచ్యుత రామారావు మాట్లాడుతూ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకపోవాలని సూచించారు.
రాష్ట్ర కన్వీనర్ కన్నెగంటి రవి మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరముందన్నారు. యాసంగిలో పంటలు కొంటామని ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర కన్వీనర్ సాయన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలతో ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. ఎస్కేఎం నేత వేములు వెంకట్రామయ్య మాట్లాడుతూ 2000లో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడి విజయం సాధించామని గుర్తు చేశారు. నల్ల చట్టాల వ్యతిరేక ఉద్యమాంలోనూ విజయం సాధిస్తామని చెప్పారు. ఎస్కేఎం జాతీయ నేత విస్సా కిరణ్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం విఫలం కాలేదనీ, అనేక విజయాలు సాధించిందని అన్నారు. చారిత్రాత్మక ఉద్యమంలోకి అన్ని వర్గాల ప్రజలు రావాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నదనీ, లౌకికవాదాన్ని నాశనం పట్టిస్తున్నదని విమర్శించారు. సంపద సృష్టించే కార్మికులు దేశాన్ని కాపాడుకుంటారని హెచ్చరించారు. అజాది అమృతోత్సవం పేరుతో దేశ ప్రజల ఆత్మసంకల్పాన్ని దెబ్బతీస్తున్నదని విమర్శించారు. ఈ సదస్సులో యూసుఫ్(ఏఐటీయూసీ), ఆశాలత, జమునా (మహిళా రైతువేదిక), సిస్టర్ లుస్సీ (డొమెస్టిట్ వర్కర్స్ యూనియన్), సూర్యం (ఐఎఫ్టీయూ), ఎం శ్రీనివాస్ (ఐఎఫ్టీయూ), నాగిరెడ్డి (రైతుకూలీసంఘం), సంధ్య, ఝాన్సీ (పీవోడబ్ల్యూ), శంకర్ ( దళిత ప్రజాఫ్రంట్), లక్ష్మణ్ (పౌరహక్కుల సంఘం), ఆర్ వెంకట్రాములు (తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం), వెంకట్ (డీవైఎఫ్ఐ), ఆర్ శ్రీరాంనాయక్ (తెలంగాణ గిరిజనసంఘం), బండారు రవికుమార్ ( అదివాసీ గిరిజన సంఘం), అంబటి నాగయ్య (విద్యావంతులవేదిక) లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్), పార్ధసారధి (ఐలు), సత్తార్ (అవాజ్), ఆనంద్ (పీడీఎస్యూ), ప్రదీప్ (పీవైఎల్), మురహరి, డాక్టర్ రజనీ, సంఘ మిత్ర, రవిచంద్ర, రాగసుధ, అంజయ్యనాయక్, బండికిరణ్ తదితరులు బంద్కు మద్దతుగా మాట్లాడారు.
కార్యచరణ
- 20 లోపు జిల్లా సదస్సులు
- 25 లోపు మండల, గ్రామాల్లో సమావేశాలు పూర్తి చేయాలిత
- కరపత్రాలు, పోస్టర్లతో విస్తృత ప్రచారం
- 24, 25, 26 తేదీల్లో ఆటో, సైకిల్ మోటార్ ర్యాలీలు
- భారత్ బంద్కు మద్దతును కూడగట్టేందుకు వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు వినతిపత్రాలు సమర్పించాలి.
- వ్యాపారవర్గాలు, పరిశ్రమల వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి