Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్, పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
- కార్పొరేటర్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- ఓట్లేసి గెలిపించిన నాయకులను నిలదీద్దాం
- పాదయాత్ర ముగిసే లోపు సమస్యల పరిష్కారంపై స్పష్టతనివ్వాలి.. లేని పక్షంలో 1.20 లక్షల మంది కార్మికులతో ఉద్యమం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
- రంగారెడ్డి జిల్లాలో కొనసాగిన ' కార్మిక గర్జన పాదయాత్ర'
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గాల శ్రమను బడా పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలకు అమ్ముకుని.. పేదల రక్త మాంసాలను పీల్చుకుతింటున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య ఆరోపించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన 'కార్మిక గర్జన పాదయాత్ర' ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్, కోహెడ, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో ఐదు రోజూ కొనసాగింది. ఈ ప్రాంతంలోని కార్మికులు పాదయాత్ర బృందం సభ్యులకు పెద్దఎత్తున మద్దతు తెలిపారు. తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో పాదయాత్ర బృందం సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్, వీరయ్య, జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, పాలడుగు భాస్కర్ మాట్లాడారు. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వం, ఉన్న వేతనాల్లో కోతలు విధిస్తోందన్నారు. స్వరాష్ట్రంలో మన హక్కులు మనవి.. మన కొలువులు మనవి అని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. తన జీతం మూడింతలు పెంచుకున్నడే తప్పా.. కార్మికులకు మాత్రం కనీస వేతనం అమలు చేయడం లేదని విమర్శించారు. కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సింది పోయి.. కంపెనీల యాజమాన్యాల పంచాన చేరి కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా పేదలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఇంటింటికీ తాగునీరు, ఇండ్ల పట్టాల పంపిణీ, పోడు భూముల సమస్య పరిష్కారం, తదితర అనేక హామీలు నీటి మీది రాతలు గానే మిగిలిపోయాయని ఆరోపించారు. తుక్కయాంజల్లోని సుందరయ్య కాలనీ ఏర్పాటై దాదాపు 15 ఏండ్లు గడుస్తున్నా ఇక్కడి పేదలకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వానికి వారికి కనీస వేతనాలు అమలు చేయాలన్నా సోయి లేదన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికుల వేతన పెంపుపై ఈ నెల చివరి వరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దళితబంధు పథకం పారిశుధ్య కార్మికులకే ముందుగా ఇవ్వాలన్నారు. కార్మికుల శ్రమను యాజమాన్యాలకు అమ్మేందుకు కుట్రలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో యాజమాన్యాలు కోట్లు గడిస్తుంటే.. కార్మికులు మాత్రం పూట గడవని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఊడిగం చేయడం మాని.. కార్మికుల హక్కులను కాపాడాలని, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.