Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
- ఎస్సీకేఎస్, ఎస్సీఈయూ ఆధ్వర్యంలో శ్రీకారం
- రాష్ట్రంలో పది రోజుల పాటు సాగనున్న జీపుజాత
- నేడు గోలేటిలో ప్రారంభించనున్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు
- 23న కొత్తగూడెంలో ముగింపు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం.. కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీయూటీయూ సిద్ధమవుతోంది. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరుయాత్ర సాగించాలని నిర్ణయించింది. సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్సీకేఎస్), సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (ఎస్సీఈయూ) ఆధ్వర్యంలో కార్మిక పోరుయాత్రకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు నిర్వహించే ఈ జీపుజాత సోమవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటిలో ప్రారంభం కానుంది. ఈ జీపు జాతాను నేటి ఉదయం 7 గంటలకు గోలేటి గని వద్ద సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు ప్రారంభించనున్నారు అక్కడి నుంచి బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల గుండా సాగుతుంది. మధ్యాహ్నం సమయంలో మందమర్రిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సాయిబాబు మాట్లాడనున్నారు. ఈ యాత్రకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసినట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మందా నర్సింహారావు, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టి. రాజారెడ్డి వెల్లడించారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..!
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటం నిర్వహించి వాటి పరిష్కారమే ధ్యేయంగా పోరాడింది సీఐటీయూ. తాజాగా అనుబంధ సంఘాలైన ఎస్సీకేఎస్, ఎస్సీఈయూ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. మోనిటైజేషన్ పేరుతో ప్రభుత్వరంగ కంపెనీలు, బొగ్గుబావుల అమ్మకాన్ని ఆపాలనీ, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలనీ, 74 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలు సవరించి జీఓ ఇవ్వాలనీ, జీఓ నెం 22ను గెజిట్లో ప్రకటించాలనీ, కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయాలనే డిమాండ్లతో ఈ పోరుయాత్ర సాగనుంది. కేంద్రం ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ను వెంటనే ప్రారంభించాలనీ, కొత్త బావులు తెరిచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనీ, ముఖ్యమంత్రి హామీ ప్రకారం కార్మికుల మారుపేర్ల మార్పిడి వెంటనే అమలు చేయాలనీ, కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్ ఇండియా మాదిరిగా సింగరేణిలో క్యాడర్ స్కీంలు అమలు, 2020-21 సంవత్సరం లాభాలు ప్రకటించి 35 శాతం వాటా చెల్లించాలనీ, సింగరేణికి బకాయి పడిన రూ.12వేల కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనీ, పెర్క్స్పై ఇన్కం ట్యాక్స్ కంపెనీ భరించాలనీ, సీఎంపీఎఫ్ లెక్కలు ఆన్లైన్లో అనుసంధానం చేయాలనీ కోరుతున్నారు. కార్మికులకు సొంత ఇంటి కోసం 250 గజాల స్థలం కేటాయించాలనీ, ఖాళీగా ఉన్న క్వార్టర్లను రిటైర్డ్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని స్పష్టం చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు ప్రమాదంలో మరణిస్తే రూ.15 లక్షల ప్రత్యేక పరిహారం చెల్లించాలనీ, ప్రమాద బీమా విధానాన్ని ప్రకటించాలని కార్యాచరణ రూపొందించారు.
పది రోజుల పాటు యాత్ర
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఈ పోరు యాత్ర రాష్ట్రంలో 10 రోజుల పాటు కొన సాగుతుంది. ఈ నెల 13న గోలేటిలో ప్రారంభమవుతున్న ఈ యాత్ర 13, 14 తేదీల్లో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో 15,16,17 తేదీల్లో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ప్రాంతంలో, 18న భూపాలపల్లిలో, 19 నుంచి 23 వరకు కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. 23న సాయంత్రం 5 గంటలకు కొత్తగూడెం ప్రధాన కార్యాలయం వద్ద ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు సంఘం నాయకులు పేర్కొన్నారు.