Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశభవిష్యత్ యువతరంపైనే ఆధారపడి ఉన్నదనీ, ఆ దిశగానే వారిలో క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సమాజ సంక్షేమ కాంక్ష వెల్లడి కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్సీ 22వ వ్యవస్థాపక దినోత్సవం, 128వ స్వామి వివేకానంద చికాగో ప్రసంగ వార్షికోత్సవాలను పురస్కరించుకొని రామకృష్ణమఠం ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్ నిర్వహించారు. దీనికాయన ముఖ్య అతిధిగా హాజరై ఆన్లైన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణమఠం సేవల్ని ఆయన ప్రసంసించారు. చికాగో సదస్సు ద్వారా ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మికతను పరిచయం చేసిన మహానీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. ఆయన సమాజ బాధ్యతల్ని గుర్తించి, యువతను ప్రేరేపించారని గుర్తుచేశారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనీ, తమ ఆలోచనలతో అద్భుతాలు సృష్టించగలరని చెప్పారు. భారత స్వాతంత్య్ర సాధనలో యువతరం పాత్ర లేకుండా పోరాటం లేదన్నారు. దేశంలోని అసమానతల్ని యువతరం గుర్తించి, ఆ సవాళ్లలో మార్పుల కోసం భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. దేశంలో 15-35 ఏండ్ల మధ్య యువత 65 శాతం ఉందనీ, ఈ దేశ భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలోనూ అనేకమంది యువ న్యాయవాదుల్ని చూస్తున్నామనీ, వారు సమాజ హితం కోసం సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పుస్తక పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందన్నారు. యువకులు, విద్యావంతులు గ్రామాలకు వెళ్లాలనీ, అక్కడి సమస్యలపై అధ్యయనం, పరిష్కారం, ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తమలోని నైపుణ్యాన్ని వెలికితీసి గ్రామం కోసం, దేశం కోసం దాన్ని వినియోగించాలని చెప్పారు. కార్యక్రమానికి హైదరాబాద్ రామకృష్ణమఠం బాధ్యులు స్వామి బోధమయానంద అధ్యక్షత వహించారు. బేలూరు రామకృష్ణమఠం ఉపాధ్యక్షులు స్వామి గౌతమానందజీ మహరాజ్, ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానందజీ మహరాజ్ శుభభాషణలు వినిపించారు.