Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా టు జనగామకు అవినీతి లింకు
- సబ్సిడీ గేదెల పంపిణీలో అవకతవకలు
- యూనిట్కు నాలుగు బదులు రెండు అందజేత
- మిగిలిన వాటికి రుణం డబ్బులు వసూల్
- పట్టించుకోని ఎస్సీ కార్పొరేషన్
- లబోదిబోమంటున్న లబ్దిదారులు
దళితుల అభివృద్ధి, సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పని చేయాల్సిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అసలు లక్ష్యానికి ఎసరు పెట్టారు. వీరికి బ్యాంకు అధికారులూ తోడవ్వడంతో దళిత రైతులు లబోదిబోమంటున్నారు. సబ్సిడీ కింద మంజూరైన పాడి గేదెల పంపిణీలో యూనిట్కు నాలుగు గేదెలు ఇవ్వాల్సి ఉండగా.. రెండు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైగా ఇవ్వని వాటికీ రుణాన్ని మంజూరు చేసి నిధుల ఖర్చుల్లో అవినీతికి పాల్పడినట్టు లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. ఇవ్వని రుణానికి కూడా వడ్డీతో సహా ఆరు నెలలు ముందుగా బ్యాంకర్లు ముక్కుపిండి వాయిదాలు వసూలు చేశారని వాపోతున్నారు. ఇందుకు జనగామ జిల్లానే నిదర్శనం.
నవతెలంగాణ-జనగామ రూరల్
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై దళితులకు పాడి గేదెల పంపిణీకి జనగామ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. పలు గ్రామాలకు చెందిన 39మంది దళిత రైతులను లబ్దిదారులుగా ఎంపిక చేశారు. ఒక్కో పాడి గేదెను రూ.లక్షకు కొనుగోలు చేసి లబ్దిదారులకు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కో యూనిట్ (నాలుగు గేదెలు)కు రూ.4లక్షలు మంజూరు చేశారు. ఇందులో రూ.2.40లక్షలు సబ్సిడీ, మిగతా రూ. 1.60లక్షలకు బ్యాంకు రుణం మంజూరు చేశారు. బ్యాంకు రుణం వడ్డీతో కలిపి నెలకు రూ.4వేల చొప్పున 60నెలలు వచ్చే నెల నుంచి నెలనెలా చెల్లించేలా బ్యాంకులు రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. కాగా, నాలుగు గేదెలకు ఒకేసారి కాకుండా రెండు విడతలుగా రెండు గేదెలను అందించాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. దాంతో కానీ, రెండు గేదెల కొనుగోలుకు అవసరమైన మొదటి విడత నిధులు రూ. 1.20లక్షలు మాత్రమే లబ్దిదారులకు ఇచ్చారు. రెండు గేదెల కు మంజూరైన రూ.2లక్షల్లో హర్యానాకు వెళ్లేందుకు ఒక్క గేదెకు రూ.25వేల చొప్పున ఒక్కో లబ్దిదారుని నుంచి రూ. 50వేలు ఖర్చులు నిమిత్తంకేటాయించారు. రైతులను హర్యా నాకు తీసుకెళ్ళి తీసుకువచ్చేందుకు ప్రయాణ ఖర్చులు, భోజనం, వసతితో పాటు గేదెలను ఇక్కడకు తరలించేం దుకు ట్రాన్స్పోర్టు ఖర్చులన్నీ వీటిల్లోనే ఉంటాయని అధికారులు చెప్పారు.
దూరాభారంతో గేదెలు అనారోగ్యం..
గతనెల ఆగస్టు10న వరంగల్ నుంచి రైతులను హర్యానా లోని జింద్ జిల్లాకు మండల పశువైద్యాధికారి రాజశేఖర్, కాంట్రాక్టు దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన కాంట్రా క్టర్ ప్రతినిధి తీసుకువెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో పది రోజుల పాటు తిరిగి గేదెలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసిన రైతులు పడ్డ కష్టాలు, అనుభవించిన నరకయాతన అంతా ఇంతా కాదు. వారి బాగోగులు చూసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఎవరూ వారి వెంట లేకపోవడం గమనార్హం. అష్టకష్టాలు పడిన రైతులు బతుకు జీవుడా అంటూ పది రోజుల అనంతరం ఆగస్టు 20న జనగామకు చేరుకున్నారు. హర్యానా నుంచి ట్రక్లో వారం రోజులపాటు నిలబడి ప్రయాణించడం వల్ల కొన్ని గేదెలు అనారోగ్యానికి గురయ్యాయి. 8 గేదెలు తీసుకురావాల్సిన ట్రక్కులో 12 నుంచి 15 వరకు తీసుకురావడంతో 5,6 గేదెలకు గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) జరిగింది. చీటాకోడూరు గ్రామానికి చెందిన బొట్ల రమేష్కు చెందిన గేదెకు తీవ్ర గాయమైంది. ఇక్కడకు చేరిన నాలుగు రోజుల అనంతరం వడ్లకొండకు చెందిన తూడి యాదగిరికి చెందిన గేదె అనారోగ్యంతో మృత్యువాతపడింది. కాగా గేదెలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడే వరకు లబ్దిదారులకు నెలకు సరిపోయే దాణా సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటికీ అందలేదు. దాంతో పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. మార్గమధ్యలో కాలు విరిగిన గేదెకు బదులుగా తర్వాత విడతలో మరో గేదెను అందిస్తామనీ, ఇక్కడికి వచ్చాక అనారోగ్యంతో మృతి చెందిన గేదెకు ఇన్సూరెన్స్ (బీమా) ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) జరిగి నష్టపోయిన లబ్దిదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
గేదెలు, రైతులకే రూ.లక్ష ఖర్చు : కాంట్రాక్టర్ రమేష్, హైదరాబాద్
యూనిట్లో ఒక్కో గేదెను హర్యానాలో కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొచ్చేందుకు మాకు రూ.75 వేలు చెల్లిస్తారు. మిగతా రూ.25 వేలు రైతులను హర్యానాకు తరలించేందు కు రవాణా ఖర్చులు, అక్కడ భోజనం, వసతి, నెలకు సరి పడా దాణా కోసం సంబంధిత అధికారులు ఖర్చు చేస్తారు.
గేదెల పరిశీలన వరకే మా విధి : మండల పశువైద్యాధికారి రాజశేఖర్
రైతులతో పాటు హర్యానాకు నేను కూడా వెళ్లాను. గేదె ఎన్ని నెలల సూడితో ఉందో పరిశీలించడం వరకే నా విధి. కొన్ని గేదెలు ఇక్కడికి చేరిన తర్వాత అనారోగ్యానికి గురై గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) జరిగిన మాట వాస్తవమే.
అవకతవకలపై విచారణ ఏదీ ?
మొదటి విడతలో రెండు గేదెలకు రూ.1.20లక్షలు మంజూరు చేసిన బ్యాంకు అధికారులు ఆరు నెలల తర్వాత రెండో విడతలో వచ్చే గేదెలకు కూడా ఇప్పటి నుంచే వడ్డీతో సహా చెల్లించేలా ఒప్పందం చేసుకోవడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 39 మంది రైతుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.20 లక్షలు ఖర్చుల నిమిత్తం తీసుకున్న అధికారులు వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారో విచారణ చేపట్టాలని లబ్దిదారులు కోరుతున్నారు. కాగా, దీనిపై నవతెలంగాణ ప్రతినిధి జనగామ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కోర్నాల్సను వివరణ కోరగా.. తమ వద్ద వాటి వివరాలు లేవనీ, మండల కార్యాలయంలో సంప్రదించాలని చెప్పడం గమనార్హం.
సబ్సిడీ గొర్రెల పంపిణీపై విచారణ జరిపించాలి
ఒక్కో యూనిట్కు రూ.25వేల చొప్పున రూ.50 వేలు ఖర్చు నిమిత్తం తీసుకున్నారు. హర్యానాలో వారం రోజుల పాటు ఈగలు, దోమల నడుమ నరకయాతన అనుభవించాను. ఎనిమిది పశువులను తీసుకురావాల్సిన ట్రక్కుల్లో 15 పశువుల వరకు కుక్కడంతో వారంరోజుల ప్రయాణంలో గేదెలు అనారోగ్యానికి గురయ్యాయి. ఇక్కడకు వచ్చిన నాలుగైదు రోజుల్లోనే గర్భవిచ్చిత్తి అవుతోంది. మరికొన్ని చనిపోతున్నాయి. సబ్సిడీ గొర్రెల పంపిణీపై ఎస్సీ కార్పొ రేషన్ అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలి.
- బాధితుడు, ముక్క స్వామి, జనగామ మండలం చౌడారం గ్రామం