Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సైదాబాద్ బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసిన నిందితుణ్ని దిశ ఘటనలో మాదిరిగానే ఎన్కౌంటర్ చేయాలని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ వస్తున్న కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించాలన్నారు. లేదంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఒప్పుకోవాల్సి వస్తుందని సవాల్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో బలవంతులకు మాత్రమే న్యాయం జరుగుతున్నదనీ, గిరిజనులకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనపై మంత్రులు సైతం స్పందించటం లేదనీ, ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నా పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ చవటలు, దద్దమ్మల్లా తయారయ్యారని విమర్శించారు. రాష్ట్ర హౌంమంత్రికి సిగ్గులేదన్నారు. గంజాయి నిరోధకానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.