Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యాజేఏసీకి మంత్రి సబిత హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అతిధి అధ్యాపకుల నియామకాన్ని రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఇంటర్ విద్యా జేఏసీకి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆమెను జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్రెడ్డి నేతృత్వంలో కలిసి సమస్యలను వివరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1.14 లక్షల అడ్మిషన్ల తో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కళకళలాడుతున్నాయని తెలిపారు. కానీ వారికి బోధించడానికి సరిపడా అధ్యాపకుల్లేక ఇబ్బందికర పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అతిధి అధ్యాపకులను ఇప్పటి వరకు నియమించకపోవడం వల్ల పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేకపోతున్నామని వివరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయివేటు కాలేజీలవైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. కాలేజీల నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షులు కళింగ కృష్ణకుమార్, సహ ప్రధాన కార్యదర్శి రామానుజాచారి, సంయుక్త కార్యదర్శులు ధర్మేంద్ర, ఆంజనేయరావు, మహిళా కార్యదర్శులు రజిత, కవిత కిరణ్, రాణి తదితరులు పాల్గొన్నారు.
విద్యావాలంటీర్లను రెన్యూవల్ చేయండి: టీవీవీఎస్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధించేందుకు విద్యావాలంటీర్లను నియమించాలని తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం (టీవీవీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్లో కలిసి ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మఠం శివానందస్వామి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల ఒకటి నుంచి బడుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనందున విద్యావాంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమైతే రెన్యూవల్ చేస్తామని మంత్రి గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదనీ, హాజరు శాతం 60 శాతానికి చేరుకుందని తెలిపారు. అయితే ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదముందని వివరించారు. సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. 17 నెలలుగా రెన్యూవల్ లేక విద్యావాలంటీర్లకు వేతనాల్లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు.