Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హాతో భేటీలో సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పల్లెప్రగతి తదితర కార్యక్రమాలవల్ల గ్రామాలు అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి పథకాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్ర నాథ్ సిన్హా హైదరాబాద్కు సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ..పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతలో గణనీయ మార్పు వచ్చిందన్నారు. దీని ఫలితంగా పచ్చదనం పెరగడమే కాకుండా కొన్నేండ్లుగా వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గిందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ఒక పల్లె ప్రకతివనం, నర్సరీ, వైకుంఠ ధామం, కంపోస్ట్ యూనిట్, ట్రాక్టర్ ఉన్నాయని చెప్పారు. గ్రామ పంచాయితీలకు ప్రతీ నెలా రూ. 227 కోట్ల నిధులు అందజేస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేవలం 8684 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉండేవనీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రతీ గిరిజన తండా, గిరిజన గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చామని దీంతో వాటి సంఖ్య 12,769కి పెరిగాయని గుర్తుచేశారు. హరితహారం పేరుతో గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు విశేష కృషి జరుగుతున్నదనీ, నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా సర్పంచులు, కార్యదర్శులపై భాద్యత పెట్టామని అన్నారు. రాష్ట్రంలో 47,70,428 సభ్యులుగల 4,39 ,648 స్వయం సహాయక మహిళా సంఘాలున్నాయనీ, వాటికి ప్రతి ఏడాది దాదాపు రూ. 10 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ మహిళా సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వివిధ ఆదాయ పెంపు పథకాలు వర్తింపచేస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఉపాధి హామీ తదితర పధకాలను సమర్థవంతంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధిపథకాల అమలుతీరును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు.