Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విభజన హామీలను అమలు చేయకుండా బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేలు దాస్యం వినరు భాస్కర్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ మోసం చేస్తే, ఇప్పుడు బీజేపీ దాన్ని కొనసాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాథూరుకు తరలించిందని విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం విషయంలోనూ ఇదే విధంగా చేసిందన్నారు. పాదయాత్రలు చేసే నైతిక అర్హత బండి సంజరు కు లేదనీ, ముందు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యమిస్తూ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నదని ఆరోపించారు. వరంగల్ లో పాదయాత్రకు ముందే సంజరు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో ఓట్లడిగే అర్హత బీజేపీకి లేదన్నారు.
సాగు రంగానికి కేటాయింపులు పెంచాలి: కేంద్రానికి సింగిరెడ్డి వినతి
తెలంగాణ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్రం నుంచి వివిధ పథకాల రూపంలో పది రెట్లు పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజేకు ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఏడాదికి రూ.800 కోట్లు మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా తదితర వినూత్న పథకాల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లు రైతుల భద్రత, వ్యవసాయ పెట్టుబడుల కోసం ఖర్చు చేసిందని వివరించారు. దేశంలోని భూవిస్తీర్ణంలో తెలంగాణ వాటా 3.4 శాతం మాత్రమే అయినప్పటికీ మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో రాష్ట్ర వాటా 4.65 శాతంగా ఉన్నదని గుర్తుచేశారు. జాతీయస్థాయిలో వివిధ ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర వాటా 9.9 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. వ్యవసాయ అనుకూల విధానాలతో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని కేంద్ర మంత్రిని కోరారు.