Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద టీఎస్యూటీఎఫ్ నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను తక్షణమే కొత్త జిల్లాలకు బదిలీలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద ఆ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. జెడ్పీ ప్రధాన కార్యనిర్వహణాధికారులు వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఈవోలను ఏర్పాటు చేశారు. సిబ్బందిని విడగొట్టారు. జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ చైర్మెన్లు ఎన్నికయ్యారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల వర్గీకరణ పూర్తయింది. వారి వేతనాలను నూతన జిల్లాల ట్రెజరీల ద్వారానే చెల్లిస్తున్నారు. అయినా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను మాత్రం ఇంకా పాత తొమ్మిది జిల్లాల ప్రజాపరిషత్ల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. పీఎఫ్ ఖాతాలను తాజాపరచి ఉద్యోగులు పనిచేస్తున్న కొత్త జిల్లాల వారీగా ఆయా జిల్లా ప్రజాపరిషత్లకు తక్షణమే బదిలీ చేయాలని శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ కమిషనర్కు ప్రాతినిధ్యాలు సమర్పించి చర్చించిన ఫలితంగా 2020, ఏప్రిల్ 27న అందుకనుగుణంగా మెమో జారీ చేశారు. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను తాజా పరచి కొత్త జిల్లా ప్రజాపరిషత్లకు బదిలీ చేయాలని ఆదేశించారు. 17 నెలలైనా ఆ ఆదేశాలు అమలు జరగలేదని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. ఇంకా ఖాతాలు అప్డేట్ చేయలేదని పేర్కొన్నారు. నూతన జిల్లాలకు బదిలీ ప్రక్రియ ప్రారంభం కాలేదని వివరించారు. తమ ఖాతాల నిర్వహణ పట్ల ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని తెలిపారు. తక్షణమే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను అప్డేట్ చేసి వారు పనిచేస్తున్న జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాలకు బదిలీ చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు జరిగాయని వివరించారు.