Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కుట్రల్ని తిప్పికొట్టాలి : కవిసమ్మేళనంలో కవులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమి, దాన్ని వర్గపోరాటంగా కాకుండా హిందూ, ముస్లింల కొట్లాటగా బీజేపీ చిత్రికరించే ప్రయత్నం చేస్తున్నదని కవులు గర్హించారు. సాయుధ పోరాటం నాటికి అసలు బీజేపీనే పుట్టలేదని తేల్చిచెప్పారు. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూ పంపిణి, 4 వేల గ్రామాలను విముక్తి, 4వేల మంది ప్రాణత్యాగాలను మాత్రం బీజేపీ ప్రస్తావించదనీ అవన్నీ చెప్తే కమ్యూనిస్టు పార్టీ పేరు చెప్పాల్సి వస్తుందన్నారు. బైరాన్ రజాకార్లకు భూస్వాములు విష్ణు, జిన్నారెడ్డిలు ఆశ్రయం కల్పించారని, ఈ విషయాన్ని బీజేపీ ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. అక్కడి డిప్యూటి కలెక్టర్ ముస్లిం అనే నెపంతో ఆ పోరాటాన్ని హిందూ, ముస్లింల కొట్లాటగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమై 73 సంవత్సరాలైన సందర్భంగా హిమాయత్నగర్ మగ్దూం భవన్లో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సౌజన్యంతో కవిసమ్మేళనం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) ఉపాధ్యక్షులు శ్రీనిధి అధ్యక్షత వహించారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, నాయకులు కేవీఎల్, కవులు అయినంపూడి శ్రీలక్ష్మి, ఒద్డిరాజు ప్రవీణ్ కుమార్, తంగళ్ల కనకాచారి, కందుకూరు శ్రీరాములు, దూదిపాల కమల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రైతాంగ పోరాట స్ఫూర్తి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పోల్చుతూ కవితల్ని వినిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని సన్మానించారు. ప్రజా నాట్యమండలి మేడ్చల్ జిల్లా బందం ఆలపించిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కవులు, నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రభుత్వాలు చరిత్రలో ప్రాముఖ్యత ఇవ్వలేదన్నారు. అయితే ఈ పోరాటంపై ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది పరిశోధనలు, పీహెచ్డీలు చేశారని వివరించారు.