Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెంగీపై ప్రయివేటు దోపిడీ సరికాదు
- ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు రావాలి.. అన్ని సౌకర్యాలు కల్పించాం
- ఐటీ కంపెనీలు తెరవొచ్చు
- వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్....ప్రతి రోజూ 3 నుంచి 5 లక్షల మందికి : డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''కొత్త వేరియంట్ వస్తే తప్ప మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు. అలా అని ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందే. రాష్ట్రంలో 0.4 శాతం మాత్రమే పాజిటివిటీ రేట్ ఉంది. కోవిడ్ పూర్తి నియంత్రణలో ఉంది. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతాయనుకున్నాం. కానీ రాష్ట్రంలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు. తల్లిదండ్రులు వారి పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపొచ్చు. ఇప్పటివరకూ 1.15 లక్షల మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 55 మందికి మాత్రమే వైరస్ సోకినట్లు తేలింది. ఐటీ కంపెనీలు కూడా నిర్భయంగా తమ కార్యకలాపాలను కోవిడ్ జాగ్రత్తలతో కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామనీ, 40 శాతం ప్రయివేటు ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ ప్లాంట్లతో సిద్ధంగా ఉన్నాయనీ, ప్రభుత్వ అధీనంలో 3,600కు పైగా పడకలను చిన్నారుల కోసం సిద్ధంగా ఉంచామని చెప్పారు.
ప్రయివేటు దోపిడీ సరికాదు.... 104కు ఫిర్యాదు చేయండి
ఇప్పటికే కరోనా చికిత్స పేరుతో లక్షలాది మంది ప్రజలకు ఆస్తులు, డబ్బులు కోల్పోయారనీ, ఇంకా వారిని డెంగీ పేరుతో దోపిడీ చేయటం తగదని డాక్టర్ జి.శ్రీనివాసరావు హెచ్చరించారు. డెంగీ, మలేరియా తదితర రోగాలను నిర్ధారించేందుకు వీలుగా చేసే పరీక్షలకు సంబంధించి నిబంధనలున్నాయని తెలిపారు. ఆ టెస్టులు, చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించామనీ, ప్రజలు వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. సమస్యలుంటే 104కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలను బాధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్లో ఈ ఏడాది 613 డెంగీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉంటున్నాయని వివరించారు. 2019లో రాష్ట్రంలో డెంగీ కేసులు నాలుగు వేలు రాగా ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి 3 వేల కేసులు నమోదైనట్లు చెప్పారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామనివెల్లడించారు.
స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
''రాష్ట్రంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి రోజూ మూడు లక్షల నుంచి ఐదు లక్షల డోసుల వరకు అందించేందుకు సమాయత్తవుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వంద మందికి కొవిడ్ పరీక్షలు చేస్తే ఒక్కరిద్దరికి మాత్రమే పాజిటివ్ వస్తుంది. అన్ని ప్రభుత్వ డయాగ్నొస్టిక్ సెంటర్లలో కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 96 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. రాష్ట్రంలో 2.80 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా 49 శాతం మంది ఇంకా వ్యాక్సిన్ తీసుకోని జాబితాలో ఉన్నారు '' అని డీహెచ్ తెలిపారు.