Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనీ లాండరింగ్ కేసులో విచారణ
- ఎఫ్క్లబ్ జీఎం విక్రమ్ను సైత్తం ఇదే వరుసలో...
- ఎఫ్క్లబ్ కేంద్రంగా కెల్విన్ డ్రగ్స్ సరఫరా
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో నటుడు నవదీప్ను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ప్రశ్నలతో ముంచెత్తారు. అదే సమయంలో ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ విక్రమ్నూ వివిధ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారని తెలిసింది. 2017 రాష్ట్రంలో వెలుగు చూసిన డ్రగ్స్ మాఫియా ఉదంతం టాలీవుడ్ను ముంచెత్తింది. ఆ సమయంలో విచారణ జరిపిన ఎక్సైజ్, ఎన్ఫోర్సుమెంట్, సిట్ అధికారులు పలువురు సినీ ప్రముఖులను విచారించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియాలో సభ్యుడైన కెల్విన్ , విక్టర్, కమింగ్లను కూడా అరెస్టు చేశారు. కాగా ఈ డ్రగ్స్ సేకరణలో కీలక పాత్ర వహించిన కెల్విన్కు సినీనటులు డబ్బులు చెల్లించే విషయంలో మనీ లాండరింగ్కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో వారిని ఈడీ అధికారులు తాజాగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు సోమవారం నవ్దీప్తో పాటు ఎఫ్క్లబ్ జీఎం విక్రమ్లను విచారించారు. ఉదయం పది గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఇరువురిని ఒక సారి వేరు వేరుగా, మరోసారి ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి మరీ ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా నవదీప్ కు చెందిన బ్యాంకు అకౌంట్లు ,వాట్సాప్ నంబర్లను తీసుకుని వాటి ద్వారా జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించారని తెలిసింది. అలాగే విక్రమ్ కు చెందిన ఎఫ్ క్లబ్ బ్యాంకు అకౌంట్ల నుంచి భారీ మొత్తంలో కె ల్విన్, పీటర్, కమింగల అకౌంట్లకు డబ్బులు పెద్ద మొత్తంలో బదిలీ అయినట్టుగా గుర్తించారని తెలిసింది. ప్రధానంగా డ్రగ్స్ తీసుకున్న సినీ ప్రముఖులు నవ్దీప్ ద్వారా ఎఫ్క్లబ్ విక్రమ్ అకౌంట్లోకి డబ్బులు పంపించారని అతను తన అకౌంట్ నుంచి కెల్విన్కు డబ్బులను బదిలీ చేశాడని ఈడీ గుర్తించినట్టు తెలిసింది. అలాగే 2015 నుంచి 2017 వరకు మూడేండ్ల లో దాదాపు 32 మార్లు ఎఫ్క్లబ్లో విక్రమ్ పార్టీలు నిర్వహించాడనీ,ఈ పార్టీలకు హాజరైన సినీ ప్రముఖులకు కెల్విన్ డ్రగ్స్ను విక్రయించగా, ప్రతి పార్టీకి కెల్విన్ వచ్చేవాడని ఈడీ విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. వీటన్నింటిపైన దృష్టిని సారించిన ఈడీ అధికారులు దీనిపై విక్రమ్, నవ్దీప్ల నుంచి తాజాగా స్టేట్మెంట్లను నమోదు చేసినట్టు సమాచారం. దాదాపు ఎనిమిది గంటలకు పైగా వీరిద్దరిని ఈడీ అధికారులు విచారించారు.